కాంగ్రెసులో రెడ్డి వర్సెస్ కాపు
కాంగ్రెసు కార్యకర్తల్లో ఎక్కువ కాపులే ఉన్నప్పటికీ ప్రాధాన్యత మాత్రం రెడ్డిలకే ఇప్పటి వరకు ఉంది. రెడ్లంతా ఇప్పుడు జగన్ వైపు చూస్తున్న నేపథ్యంలో కాపులకు పార్టీలో కీలక పదవులు అప్పగించడం ద్వారా వారిని మరింత దరి చేర్చుకునే వ్యూహంతో పార్టీ ముందుకు వెళుతోంది. రెడ్లు దూరం కావడం ద్వారా 2014లో ఏర్పడే లోటును కాపుల ద్వారా పూడ్చుకునే ఉద్దేశ్యంతోనే చిరును దరి చేర్చుకున్నట్లు తెలుస్తోంది. చిరును తమ వైపు తిప్పుకోవడం ద్వారా చిరు అభిమానులతో పాటు, కాపు వర్గాన్ని దమ వైపు తిప్పుకోవచ్చునని కాంగ్రెసు భావిస్తోంది. సామాజికంగా, ఆర్థికంగా రెడ్డిలదే ముందంజ. కాపులకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా రెడ్ల ప్రాధాన్యం తగ్గించి లాభం పొందాలను అధిష్టానం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కూడా రెడ్లకే ప్రాధాన్యత ఉంది. కిరణ్ కేబినట్లో 15 శాఖలు రెడ్డి సామాజిక వర్గం చేతిలోనే ఉన్నాయి. అయితే కిరణ్ పనితీరుపై అధిష్టానం తీవ్ర అసంతృప్తిగా ఉన్నది. కాబట్టి క్రమంగా రెడ్లకు ప్రాధాన్యత తగ్గించి కాపులను అందలం ఎక్కించాలనే వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికిప్పుడు చిరంజీవికి సిడబ్ల్యుసిలో స్థానం కేటాయించడం ద్వారా పార్టీ రెడ్లతో పాటు కాపులకు మంచి ప్రాధాన్యం ఇస్తుందనే ధోరణి కల్పించాలని ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు మంత్రి బొత్స సత్యనారాయణకు పిసిసి పదవిని కట్టబెడతారని, వట్టి వసంతకుమార్, కన్న లక్ష్మీనారాయణలకు కూడా ప్రాధాన్యం ఉన్న పోస్టులను ఇస్తారనే వార్తల వెనుక కూడా కాపులను మరింత దగ్గరకు చేర్చుకోవాలనే ఉద్దేశ్యమే అని తెలుస్తోంది. టిడిపికి బిసి, కమ్మ, జగన్కు రెడ్డి సామాజిక వర్గం ఓట్లు ఉన్నట్లు ఇక ముందు ముందు కాంగ్రెసుకు కాపు సామాజిక వర్గం దగ్గరవుతుందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.