రాహుల్ కోసమే ప్రణబ్ను తీసుకోలేదా?
ఆ కమిటీలో రాహుల్ గాంధీతో పాటు సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్, రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ, మరో ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేదీలను నియమించారు. అయితే, ప్రస్తుతం రాహుల్ కూడా అమెరికాలోనే ఉన్నారు. సోనియాకు శస్త్ర చికిత్స పూర్తయ్యాక ఆయన తిరిగి వచ్చాకే పార్టీ పగ్గాలు చేపట్టనున్నారు. అయితే, అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత సోనియా మళ్లీ పార్టీ పగ్గాలను చేపడతారా!? లేక తనయుడినే వారసుడిగా ప్రకటిస్తారా? అనే అంశం పై సస్పెన్స్ నెలకొంది. ఇక, ప్రభుత్వంలో నెంబర్-2గా ఉన్న పార్టీ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీకి, హోం మంత్రి చిదంబరానికి ఈ కమిటీలో చోటు కల్పించలేదు. వారికి ఎటువంటి బాధ్యతలు అప్పగించకపోవడం చర్చనీయాంశమైంది.
ఈ విషయమై ప్రణబ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. అయితే, ప్రభుత్వ బాధ్యతల్లో ప్రణబ్ తలమునకలైనందువల్ల ఆయనకు పార్టీ బాధ్యతలు అప్పజెప్పలేదని పార్టీ వర్గాలు వివరిస్తున్నాయి. ఇక, రాహుల్ గాంధీని కమిటీలో నియమించాలన్న నిర్ణయాన్ని సోనియానే తీసుకున్నారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి రాజీవ్ శుక్లా చెప్పారు. ప్రధాన కార్యదర్శిగా రాహల్ ఇప్పటికే కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఆయనకు మరిన్ని బాధ్యతలు అప్పజెప్పాలని సోనియా నిర్ణయించారని చెప్పారు. ప్రభుత్వం నుంచి కమిటీలో ఒక మంత్రిని నియమించడం, పార్టీ నుంచి రాహుల్తోపాటు ఇద్దరినే నియమించడంతో రాహుల్ నేతృత్వంలోనే పార్టీ నిర్వహణ జరగనుందన్న విషయం స్పష్టమవుతోంది.
ప్రణబ్కు బాధ్యతలు అప్పజెబితే రాహుల్కు అంత పట్టు ఉండదని సోనియా భావించినట్లు తెలుస్తోంది. త్వరలోనే రాహుల్ పార్టీ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు చేపడతారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే, తన బదులు పార్టీ రోజువారీ కార్యకలాపాల నిర్వహణకు కేర్టేకర్ కమిటీని నియమించినా యూపీఏ, జాతీయ సలహా మండలి అధ్యక్ష పదవులకు ప్రత్యామ్నాయంగా ఆమె ఎవరినీ నియమించలేదు.