తెలంగాణలో అదృష్టం పరీక్షించుకోనున్న జగన్

కోమటిరెడ్డి సోదరులు జగన్ వర్గం నేతలుగా ముద్రపడినప్పటికీ వారు వాటిని కొట్టి పారేస్తున్నారు. అంతేకాదు అవిశ్వాసం సమయంలోనూ వారు జగన్ సూచనలను పాటించలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణలో తన బలం తేల్చుకునేందుకు జగన్ సిద్ధమైనట్లుగా కనిపిస్తోంది. ఇందుకు ఆయన ఉప ఎన్నికలను వేదికగా చేసుకునే అవకాశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో స్పీకర్ కొందరి రాజీనామాలు ఆమోదించిన విషయం తెలిసిందే. కొండా సురేఖపై వేటు పడే అవకాశాలు ఎక్కువే ఉన్నాయి.
సురేఖ స్థానంతో పాటు తెలంగాణలోని మిగిలిన నియోజకవర్గాలలోనూ తన పార్టీ తరఫున అభ్యర్థులను జగన్ నిలబెట్టే అవకాశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ సెంటిమెంట్ విషయం పక్కన పెడితే వైయస్ తనయుడిగా తన సత్తా చాటవచ్చునని ఆయన భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. గెలుపు కన్నా ఆ ప్రాంతంలో తన పార్టీ చొచ్చుకు వెళ్లేందుకు ఉప ఎన్నికలు బాగా ఉపయోగపడతాయని ఆయన భావిస్తున్నారట. కొండా సురేఖ సీటు తిరిగి కైవసం చేసుకోవడంతో పాటు, పలు నియోజకవర్గాల్లో టిడిపి, కాంగ్రెసు, టిఆర్ఎస్లను ధీటుగా ఎదుర్కొని తెలంగాణలోనూ పార్టీకి ఊపు తీసుకు రావాలని భావిస్తున్నారట. తెలంగాణలో తమ సత్తా నిరూపించుకునేందుకు తెలంగాణలోని జగన్ వర్గం కూడా ఉవ్వీళ్లూరుతోంది.












Click it and Unblock the Notifications