తెలంగాణలో సిఎం రచ్చబండ జరిగేనా?
రచ్చబండ కార్యక్రమాన్ని విజయవంతం చేసే బాధ్యతను కిరణ్ కుమార్ రెడ్డి శానససభ్యులపై పెడుతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణలో కూడా రచ్చబండ కార్యక్రమాన్ని సాకుగా తీసుకుని పర్యటించాలని అనుకుంటున్నారు. అయితే, తెలంగాణలో రచ్చబండ కార్యక్రమాన్ని చేపట్టవద్దని ఈ ప్రాంత శాసనసభ్యులు ఆయనకు సలహాలు ఇస్తున్నారు. ప్రస్తుత స్థితిలో తెలంగాణలో పర్యటించకపోవడం మంచిదని తెలంగాణ ప్రాంత మంత్రులు, కాంగ్రెసు శాసనసభ్యులు సలహాలు ఇస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్పై కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులపై ప్రజలు మండిపడుతున్నారు. వారిని ఎక్కడికక్కడ నిలదీసేందుకు సిద్ధపడుతున్నారు. తెలంగాణలో పర్యటించాలని ప్రయత్నిస్తున్న సీమాంధ్ర నాయకులందరికీ వ్యతిరేకత ఎదురవుతూనే ఉన్నది. ఈ వాతావరణంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినా ముఖ్యమంత్రి తెలంగాణలో పర్యటించకపోవడమే మంచిదని అంటున్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి పర్యటన అంత సులభం కాకపోవచ్చుననే మాట కూడా వినిపిస్తోంది.