సవతి తల్లి ప్రేమ: ఆజాద్కు పొన్నాల నివేదిక!
కృష్ణా జలాల్లో తెలంగాణకు కేటాయించిన వాటాకు తాము అంగీకరిస్తున్నామని, కానీ తెలంగాణ, సీమాంధ్రుల మధ్య సాగునీటి సమస్యలు తలెత్తకుండా శ్రీకృష్ణ కమిటీ సూచించినట్లు నియంత్రణా వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆ నివేదికలో కోరారు. అలాగే పొన్నల ఇచ్చిన నివేదిక ప్రకారం జలయజ్ఞంలో నిధుల వ్యయం, అందుబాటులోకి వచ్చిన సాగుభూమి విషయాల్లో తెలంగాణకే అగ్రభాగాన ఉందంట. అయితే నివేదిక సమర్పించిన అనంతరం పొన్నాల మీడియాతో మాట్లాడారు. నదీ జలాలు, సాగునీటి ప్రాజెక్టులు విభజనకు అడ్డంకి కాబోవని ఆజాద్ చెప్పారని అన్నారు. నివేదికలో పేర్కొన్న ప్రకారం... తెలంగాణ ఆంధ్రలో కలవకముందు సాగు విస్తీర్ణం 20 లక్షల ఎకరాలు కాగా ఆ తర్వాత 70 లక్షల ఎకరాలకు సాగులోకి తీసుకు వచ్చే ప్రతిపాదనను హైదరాబాదు రాష్ట్రం విస్మరించిందని చెప్పారు. హైదరాబాద్ రాష్ట్రాన్ని విభజించకుంటే మంచి సాగునీటి అవకాశాలు ఉంటాయని బచావత్ ట్రిబ్యునల్ చెప్పింది.
దానిని పరిగణలోకి తీసుకొని కృష్ణా నీటిని ఎత్తిపోతల ద్వారా తెలంగాణ, ముఖ్యమంగా మహబూబ్ నగర్ జిల్లాకు తరలించాల్సి ఉండగా ప్రభుత్వం తిరస్కరించడంతో ఆ జిల్లా కరువు జిల్లాగా మారిపోయింది. ఇచ్చంపల్లి, దేవనార్ ప్రాజెక్టుల్ని ప్రభుత్వం విస్మరించింది. శ్రీరాం సాగర్, నాగార్జున సాగర్ ఎడమ కాల్వ విషయంలో పక్షపాత ధోరణి వ్యవహరించింది. తెలంగాణ కోసం ప్రతిపాదించబడిన శ్రీరాం సాగర్, జూరాల ప్రాజెక్టులు దశాబ్దాల కిందట ప్రారంభమైనా నిర్మాణం ఇంకా కొనసాగుతూనే ఉంది. 1944లో హైదరాబాదు, మద్రాసు ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం తుంగభద్ర జలాల్ని ఇరు రాష్ట్రాలు సమానంగా పంచుకోవాల్సి ఉంది. కానీ విలీనం తర్వాత హైరాబాదుకు రావాల్సిన ఆర్డీఎస్ కాల్వ విషయాన్ని బచావత్ ట్రిబ్యునల్ ముందు పెట్టలేదు. దీంతో తెలంగాణకు రావాల్సిన వాటాలో చాలా చెన్నైకి దక్కాల్సిన కెసి కెనాల్కు పోయింది. ఇక ఆర్డీఎస్లోనూ తెలంగాణకు రావాల్సిన వాటాలో ఎప్పుడు సగం కూడా దాటలేదు.
రాష్ట్ర ప్రభుత్వ మద్దతుతో కెసి కెనాల్ రైతులు మాత్రం అన్యాయమైన పద్ధతుల్లో నీటిని మళ్లించుకునే వారు. ప్రస్తుతం తెలంగాణలో 17 లక్షల మంది రైతులు మోటారు పంపుసేట్లతో భూగర్భ జలాలపై ఆధారపడ్డారు. ఎపి ఏర్పాటైన దగ్గరనుండి ఆంధ్రా ప్రాంత నదీజలాల వాటాను వినియోగించడంపై ప్రభుత్వం పెట్టిన శ్రద్ధ తెలంగాణ వాటా నదీ జలాలు, మిగులు జలాల్ని వినియోగించడంపై పెట్టలేదు. దీంతో తెలంగామ వాటా నదీ జలాలు, మిగులు జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. భారీ వ్యయంతో గోదావరి, కృష్ణా, పెన్నా బేసిన్లను ఆధునీకరించిన లబ్ధి ఆంధ్రా రైతులకే. కృష్ణా నదిలో 68.50, గోదావరిలో 79 శాతం పరివాహక ప్రాంతం తెలంగాణదే. బచవత్ ట్రిబ్యునల్ ఏర్పాటుకు ముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కృష్ణా బేసిన్లో తెలంగాణకు నీటిలో మంచి వాటా దక్కేది. కాగా గత జలయజ్ఞంలో తెలంగాణకే అగ్రపీఠం వేశారు.