తెలంగాణ రాజకీయం: దళిత్ వర్సెస్ దళిత్
మోత్కుపల్లి నర్సింహులు కెసిఆర్ను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. కెసిఆర్ ప్రతిస్పందించి తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తే అది వివాదంగా మారే ప్రమాదం చోటు చేసుకుంది. అలాంటి వివాదం కోసమే మోత్కుపల్లి నర్సింహులు వ్యాఖ్యలు చేస్తున్నారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈ స్థితిలో తెరాస నాయకత్వం తమ పార్టీ దళిత నాయకుడు ఎ. చంద్రశేఖర్ను రంగంలోకి దింపింది. మోత్కుపల్లి నర్సింహులుపై చంద్రశేఖర్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ రకంగా తెలంగాణ రాజకీయం ఓ దళిత నాయకుడికి, మరో దళిత నాయకుడికి మధ్య పోరాటంగా మారింది. మోత్కుపల్లి నర్సింహులను జాతి నుంచి బహిష్కరిస్తున్నామని ఏకంగా చంద్రశేఖర్ ప్రకటన చేశారు.
తెలుగుదేశం, తెరాస మధ్య తెలంగాణ రాజకీయం వేడెక్కిన క్రమంలో కాంగ్రెసు తన పని తాను చేసుకుంటూ పోతోంది. గత కొద్ది రోజులుగా కెసిఆర్ ఫామ్ హౌస్లో గడుపుతున్నారు. భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ రూపొందించడంలో ఆయన మునిగిపోయారని తెరాస నాయకులు అంటున్నారు. అయితే, దాన్ని ఆసరా చేసుకుని తెలుగుదేశం నాయకులు కెసిఆర్పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.