ఉండవల్లి చొరవ: తెలంగాణ సమస్య తీరేనా?
హైదరాబాదును రెండు రాష్ట్రాల రాజధానిగా ఉంచడానికి అంగీకరించాలని ఉండవల్లి తెలంగాణ పార్లమెంటు సభ్యులను గురువారం జరిగిన ఓ సమావేశంలో కోరినట్లు వార్తలు వచ్చాయి. సరిహద్దులు, నదీజలాల పంపకం అంశాలను నిపుణుల ద్వారా తేల్చుకోవచ్చునని, సీమాంధ్రులు దశాబ్దాలుగా అనుబంధం పెంచుకున్న హైదరాబాదు మాత్రమే సమస్యగా ఉందని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. హైదరాబాదు సాంకేతికంగా తెలంగాణ రాష్ట్రంలోనే ఉంటుందని, అయితే రెండు రాష్ట్రాలకు రాజధానిగా హైదరాబాదు ఉండాలని ఉండవల్లి ప్రతిపాదించారని అంటున్నారు.
ఉభయ రాష్ట్రాలకు హైదరాబాదు రాజధానిగా ఉండడం సాధ్యం కాదని, సీమాంధ్రులు దానికి అంగీకరించకపోవచ్చునని, ఐదేళ్లో పదేళ్లో ఉమ్మడి రాజధానిగా ఉంచి సీమాంధ్రలో రాజధానిని అభివృద్ధి చేసుకుంటే మంచిదని తెలంగాణ పార్లమెంటు సభ్యులు అన్నారు. సమస్య పరిష్కారానికి ఉభయ ప్రాంతాల ప్రతినిధులతో హైదరాబాదులో గానీ ఢిల్లీలో గానీ సమావేశం ఏర్పాటు చేయడానికి ఉండవల్లి అరుణ్ కుమార్ ముందుకు వస్తున్నట్లు సమాచారం. చర్చల్లో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు సర్వే సత్యనారాయణ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సురేష్ షేట్కర్, బలరాంనాయక్, పొంగులేటి సుధాకర్ రెడ్డి, సీనియర్ నేత కమలాకర్ రావుతో పాటు ఎమ్మెల్సీ దిలీప్ కూడా పాల్గొన్నారు.