తెలంగాణలో జగన్ కోసం ఎదురు చూస్తున్నదెవరు?

ఈ నేపథ్యంలో ఎప్పటి నుండో ఉన్న తమ ప్రాధాన్యత క్రమంగా తగ్గుతోందని తెలంగాణ ప్రాంతంలోని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు భావిస్తున్నారట. తెలంగాణ ప్రాంతంలో తాము మళ్లీ బలపడాలంటే వైయస్ జగన్ తెలంగాణలో అడుగు పెట్టాలని వారు భావిస్తున్నారట. పార్లమెంటులో తెలంగాణకు వ్యతిరేకంగా ప్లకార్డు ప్రదర్శించినందుకు గతంలో వరంగల్ జిల్లాలో జగన్ను తెలంగాణవాదులు అడ్డుకున్నారు. అయితే అప్పుడు జగన్ కాంగ్రెసు పార్టీ తరఫున ప్లకార్డు పట్టుకున్నారు. ఇప్పుడు ఆయన సొంతగా పార్టీ పెట్టారు. కానీ ఇప్పటి వరకు తన నిర్ణయం చెప్పలేదు. సీమాంధ్ర ప్రాంత ప్రజలలో తెలంగాణ పట్ల వ్యతిరేకత లేని దృష్ట్యా జగన్ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకొని ఇక్కడ అడుగు పెట్టాలని వారు భావిస్తున్నారు.
జగన్ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకొని తెలంగాణలో అడుగు పెడితే ఆయన సామాజిక వర్గం నేతలే కాకుండా చాలామంది ఆయనతో వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారనేది పలువురి వాదన. మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎప్పటికైనా జగన్ వెంట వెళ్లే వారనే అనుమానాలు పలువురిలో ఉన్నాయి. తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్ధన్ రెడ్డి కూడా జగన్ వైపు వెళతారనే ఊహాగానాలు అప్పట్లో వినిపించాయి. వీరంతా జగన్ వెంట వెళ్లే అంశాన్ని ఖండించినప్పటికీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే ఆయనతో ఖచ్చితంగా వెళ్లే అవకాశాలే ఎక్కువనే వారూ ఉన్నారు. ఇక ఇప్పటికే వరంగల్ జిల్లా రాజకీయాల్లో ప్రముఖంగా ఉన్న మాజీ మంత్రి కొండా సురేఖ, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, నిజామాబాద్ నుండి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, కరీంనగర్ నుండి గోనె ప్రకాశ రావు తదితరులు ఉన్నారు.












Click it and Unblock the Notifications