జగన్ తెలంగాణ ప్రకటన సమైక్యవాదానికే ఊతం
తెలంగాణపై వైఖరిని ప్రకటించే విషయంలో తన తెలివిని ప్రయోగించే వెసులుబాటు కూడా జగన్కు లేకుండా పోయింది. ఆయనేమైనా తెలివి ప్రదర్శించారంటే అది - ఇరు ప్రాంతాల సెంటిమెంటును గౌరవిస్తున్నామని అనకపోవడమే. కేంద్రంపై పూర్తి భారం మోపి ఆయన తెలంగాణపై తప్పించుకున్నారనే చెప్పాలి. తెలంగాణకు తాను వ్యతిరేకం కాదని జగన్ తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి కూడా అన్నారు. ఎన్నికల్లో సీమాంధ్రలో ప్రచారం చేస్తూ తీవ్రమైన తెలంగాణ వ్యతిరేక వైఖరిని ప్రదర్శించారు. తెలంగాణ సెంటిమెంటును గౌరవిస్తామని ఒప్పందం చేసుకునే 2004 ఎన్నికల్లో కాంగ్రెసు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో పొత్తు పెట్టుకుంది. అయితే, సెంటిమెంటును గౌరవించడమంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలం కాదని చేతల్లోనే కాదు, మాటల్లో కూడా స్పష్టం చేస్తోంది.
తెలంగాణపై జగన్ ప్రకటించిన వైఖరి భిన్నమైందేమీ కాదు. కాంగ్రెసు, తెలంగాణ నాయకత్వాలు అనుసరిస్తున్న వైఖరినే ఆయనా ప్రకటించారు. తెలంగాణపై అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి ఆయన సూచించారు. ఈ విషయంలో అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం సాధ్యం కాదనేది తెలిసిపోతూనే ఉన్నది. అందువల్ల అది సమైక్యవాదాన్ని బలపరిచే డిమాండ్ మాత్రమే అవుతుంది. మొత్తంగా, తెలంగాణపై వైయస్ జగన్ వెల్లడించిన వైఖరి తెలంగాణవాదులను పూర్తిగా నిరాశలో ముంచెత్తింది.