'బిల్'వార్: చిరంజీవి, కిరణ్ క్రెడిట్ తిప్పలు

ఈ క్రెడిట్ తనదంటే తనదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కేంద్ర పర్యాటక శాఖమంత్రి చిరంజీవి, ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డిలు పోటీ పడుతున్నారు. మరోవైపు ప్రభుత్వం మెడలు వంచి సబ్ ప్లాన్ బిల్లుకు చట్టబద్దత కల్పించే బిల్లును తీసుకు వచ్చామని ప్రతిపక్షాలు చెప్పుకుంటున్నాయి. అయితే అధికార కాంగ్రెసులో దీని క్రెడిట్ కొట్టేసేందుకు నేతలు పోటీ పడుతుండటం గమనార్హం.
అసెంబ్లీ ప్రాంగణంలోని తన చాంబర్లో శుక్రవారం మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన ముఖ్యమంత్రి ఇందిరమ్మ బాటలో భాగంగా జిల్లాల్లో పర్యటిస్తూ అట్టడుగు వర్గాల కష్టనష్టాలను కళ్లారా చూశానని, ఆ అనుభవం నుంచే ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కేటాయిస్తున్న నిధులు దారి మళ్లకుండా వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచాలని భావించానని చెప్పారు. ఆ ఆలోచనకు ప్రతిరూపమే ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టబద్ధతని చెప్పారు.
కేంద్ర మంత్రి చిరంజీవి అదే క్రెడిట్ కోసం ప్రయత్నించారు. ప్రజారాజ్యం పార్టీని కాంసులో విలీనం చేసేటప్పుడే ఎస్సీ, ఎస్టీ నిధులను వారి కోసమే ఖర్చు చేయాలని.. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి సూచించానని దానికి అక్షర రూపమే ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్కు చట్టబద్ధత అని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను పూర్తిగా వారి కోసమే కేటాయిస్తే వారి జీవన ప్రమాణాలు మెరుగవుతాయని, కాంగ్రెస్ పార్టీని వీడరని సూచించానని మంత్రి డిఎల్ చెప్పారు. గతంలో తాను రాసిన లేఖను మంత్రి రఘువీరా రెడ్డికి డిఎల్ చూపారు.
ఈ ఘనత తమదంటే తమదని పార్టీ నేతలు చెప్పుకుంటుంటే పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ మాత్రం బిల్లుకు చట్టబద్ధత కల్పించడంలో వ్యక్తులకు సంబందం లేదని, ఈ ఘనత పూర్తిగా పార్టీదేనని చెప్పారు. చట్టబద్దత కల్పించే సమయంలో ముఖ్యమంత్రిగా కిరణ్, దీనికోసం ఏర్పాటు చేసిన ఉప సంఘానికి అధ్యక్షుడిగా ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, సభ్యులుగా ఇతర మంత్రులు ఉండటం వారికి లభించిన గొప్ప అవకాశమన్నారు.












Click it and Unblock the Notifications