కిరణ్ తరహాలో ఇక ప్రజల్లోకి చిరంజీవి
ప్రజల్లో కలిసిపోయి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించే మార్గంలో ఆయన ఆలోచన సాగిస్తున్నట్లు చెబుతున్నారు. ఆ రకంగా ఆయన కాంగ్రెసులో తిరుగులేని నాయకుడిగా ఎదగాలని అనుకుంటున్నట్లు సమాచారం. రాష్ట్ర పర్యటనలో భాగంగా ఆయన గ్రామాలు తిరగాలని కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాత్రుళ్లు సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో బస చేస్తారని చెబుతున్నారు.
రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించే దిశగా ఆయన ఈ కార్యక్రమాన్ని రూపొందించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు ఇంకా రెండేళ్లు ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే ప్రజల వద్దకు వెళ్లడం ద్వారా ఆదరణనను, ఆభిమానాన్ని సంపాదించుకోవాలని చిరంజీవి ఆలోచిస్తున్నట్లు సమాచారం.
ప్రజా సమస్యలను తెలుసుకుని, సాధ్యమైనవాటిని తక్షణ పరిష్కరించడానికి అధికారులకు తగిన ఆదేశాలు ఇస్తారని చెబుతున్నారు. సామాన్య ప్రజానీకంతో కలిసి ప్రభుత్వ పథకాల ఫలితాలు వారికి అందేలా చూడడానికి చిరంజీవి ప్రయత్నాలు చేస్తారని అంటున్నారు. ఆగస్టు నుంచి ఆయన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతారని సమాచారం. రైతు సమస్యలపై, హాస్టళ్లలో వసతులపై, నిరుపేదల గృహనిర్మాణ కార్యక్రమంపై, ఇతర సంక్షేమ కార్యక్రమాలపై చిరంజీవి తన జిల్లా పర్యటనల్లో దృష్టి పెడతారని సమాచారం.