వైయస్ జగన్ దూకుడుకు సిఎం కళ్లెం
ఉప ఎన్నికలు జరిగే 17 స్థానాల్లో పార్టీ బలాబలాలను ఆయన అంచనా వేసినట్లు చెబుతున్నారు. వైయస్ జగన్ పార్టీ వల్ల, చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ విలీనం వల్ల దిగువ స్థాయి పార్టీలో లుకలుకలున్నట్లు ఆయన గుర్తించారు. స్థానిక నాయకులను, కార్యకర్తలను ఒకే తాటిపై నడిపించడానికి ఆయన తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు చెబుతున్నారు. మంత్రులను ఆ నియోజకవర్గాల ఇంచార్జీలుగా నియమించనున్నట్లు చెబుతున్నారు. పార్టీలో ఐక్యత సాధించాల్సిన బాధ్యతను మంత్రుల భుజస్కంధాలపై మోపడానికి ఆయన ఏర్పాట్లు చేసినట్లు కూడా సమాచారం. కొన్ని జిల్లాల్లో పార్టీ కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి. గుంటూరు జిల్లా పార్టీలోని విభేదాలు కిరణ్ కుమార్ రెడ్డికి తలనొప్పిగా పరిణమించాయి. కడప జిల్లాలో కూడా పరిస్థితి దారుణంగా ఉంది. మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి తిరుగుబాటుతో కడప జిల్లాలో కాంగ్రెసును ఏకతాటిపై తేవడం కష్టంగానే భావిస్తున్నారు.
ధర్మాన ప్రసాద రావును నర్సంపేటకు, గంటా శ్రీనివాస రావును పాయకరావుపేటకు, తోటా నర్సింహాన్ని రామచంద్రాపురానికి, వట్టి వసంతకుమార్ను పోలవరానికి, పితాని సత్యనారాయణను నర్సాపూర్కు, కన్నా లక్ష్మినారాయణను ప్రత్తిపాడుకు, మహీధర్ రెడ్డిని ఒంగోలుకు, ఆనం రామనారాయణ రెడ్డిని నెల్లూరు లోకసభ స్థానానికి ఇంచార్జీలుగా నియమించాలని ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
రఘువీరా రెడ్డిని రాయదుర్గానికి, ఎస్ శైలజానాథ్ను అనంతపురానికి, ఏరాసు ప్రతాపరెడ్డిని ఆళ్లగడ్డకు, టిజి వెంకటేష్ను ఎమ్మిగనూరుకు ఇంచార్జీలుగా నియమించాలని ముఖ్యమంత్రి యోచిస్తున్నట్లు చెబుతున్నారు.