కిరణ్ కుమార్ రెడ్డిపై అధిష్టానం సీరియస్
సమాచార హక్కు కమిషనర్ల నియామకం వ్యవహారమే ఇప్పుడు ముఖ్యమంత్రికి తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రిపై విరుచుకుపడడానికి మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి కూడా అదే విషయాన్ని ఓ అస్త్రంగా ఎంచుకున్నారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఉన్న పార్టీ నాయకులను, మంత్రులను చేరదీస్తున్నారు. అదే సమయంలో సమాచార హక్కు కమిషనర్ల నియామకం వ్యవహారం ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బ తీసేదిగా ఉందని ఆయన ఇప్పటికే అధిష్టానానికి చెప్పినట్లు సమాచారం.
చంద్రబాబుతో కుమ్మక్కు వ్యవహారం ప్రధానమైన అంశం కాగా, రాజకీయపరమైన నియామకాలనే విమర్శలు రావడం కూడా కిరణ్ కుమార్ రెడ్డికి సమస్యగానే మారింది. చంద్రబాబుతో కిరణ్ కుమార్ రెడ్డి కుమ్మక్కయ్యారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులే కాకుండా సొంత పార్టీవారు కూడా విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహారాన్ని అధిష్టానం సీరియస్గానే పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు.