బొత్స సత్తిబాబుకు ఎదురు గాలి వీస్తుందా?
ముఖ్యమంత్రి మంత్రివర్గ విస్తరణ అన్నప్పుడల్లా ఆయన ఢిల్లీ వెళ్లి విస్తరణ జరగకుండా ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స వివాదం ఓ సమయంలో అధిష్టానానికి ఇరువురు ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసే స్థాయికి వెళ్లి పోయింది. జగన్ వర్గం ఎమ్మెల్యేలపై వేటు వేయకుండా వారిని మచ్చిక చేసుకోవాలని కిరణ్ భావిస్తుండగా బొత్స మాత్రం వేటు కోసం పట్టుబడుతున్నారు. మొదట్లో కిరణ్పై కొంత అసంతృప్తిగా ఉన్న అధిష్టానం ఆ తర్వాత కాస్త ఆయనకు పట్టు కల్పించింది. మంత్రులు, ఎమ్మెల్యేల్లో బొత్స అసంతృప్తి రాజేస్తూ కిరణ్పైకి ఉసిగొల్పుతున్నారనే అంశం అధిష్టానం దృష్టికి వెళ్లడంతో బొత్సపై ముఖ్యనేతలు అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. అంతేకాకుండా అప్పట్లో రాష్ట్రానికి వచ్చిన కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్కు పలువురు నేతలు బొత్సపై ఫిర్యాదులు చేశారు.
అసెంబ్లీ సమావేశాల్లో మద్యంపై జోరుగా చర్చ జరుగుతున్న సమయంలోనూ బొత్స సమావేశాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత మంగళవారం ఆయన సమావేశాలకు హాజరయ్యారు. పంట విరామంపై చర్చ జరుగుతుండగా బొత్స మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయితే స్పీకర్ మాత్రం ఆయన మైక్ కట్ చేసి ఝలక్ ఇచ్చారు. ప్రజల్లో ఇమేజ్ ఉన్న నేత, తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి కూడా క్రమంగా బొత్సకు దూరమవుతూ కిరణ్కు దగ్గరవుతున్నారు. ప్రస్తుతం పార్టీలో బొత్సకు ఎదురు గాలి వీస్తుందని అంటున్నారు. పిసిసి చీఫ్గా బాధ్యతలు చేపట్టినప్పుడు కనిపించిన ఉత్సాహం బొత్సలో ఇప్పుడు కనిపించడం లేదని అంటున్నారు. కొత్తలో దూకుడుగా వ్యవహరించిన బొత్స ఇటీవలి కాలంలో మౌనంగా ఉంటున్నారని.. పార్టీలో ఆయన ప్రధాన్యత క్రమంగా తగ్గుతుండటమే అందుకు కారణమంటున్నారు.