రాజీకొచ్చారా: సోనియాకు జగన్ సంకేతాలు?
రాష్ట్రపతి ఎన్నికలలో యుపిఏ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి మద్దతిచ్చేందుకు జగన్ దాదాపు సిద్ధమయ్యారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. జగన్ వర్గం కాంగ్రెసు అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సబ్బం హరి ఇటీవల ఢిల్లీ వెళ్లి ప్రణబ్ చెవిలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నిర్ణయాన్ని చెప్పారట! జగన్ పార్టీ ఓటు మీకే అని ఆయనకు చెప్పారని తెలుస్తోంది. ప్రణబ్కు మద్దతివ్వడం ద్వారా భవిష్యత్తులో తాము కాంగ్రెసుతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామనే సంకేతాలను జగన్ అధినేత్రికి ఇచ్చారని చెబుతున్నారు.
గతంలోనూ జగన్ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను మతతత్వ బిజెపికి మద్దతిచ్చే ప్రసక్తి లేదని చెప్పారు. అప్పుడే ఆయన వ్యాఖ్యలో పరోక్షంగా కాంగ్రెసుకు అన్నట్లుగా ఉన్నాయనే వాదనలు వినిపించాయి. తాజాగా దాదాకు మద్దతు ప్రకటించడం ద్వారా కాంగ్రెసును మచ్చిక చేసుకోవాలనుకుంటున్నారని అంటున్నారు. జాతీయ కాంగ్రెసుతో మంచిగ లేకుంటే కష్టనష్టాలు తప్పవనే నిర్ణయానికి జగన్ వచ్చారని, అందుకే వ్యూహాత్మకంగా ఆ పార్టీ వైపు మొగ్గుతున్నారని అంటున్నారు.
అదే లేకుంటే ఆయన మరో అభ్యర్థి సంగ్మాకు మద్దతిచ్చేవారని చెబుతున్నారు. టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు భావిస్తున్నట్లుగా సంగ్మా బిజెపి అభ్యర్థి కాదని విశ్లేషిస్తున్నారు. బిజెపి రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం తర్జన భర్జన పడేకంటే ముందే సంగ్మా తనకు తానుగా రాష్ట్రపతి రేసులోకి దూకారని చెబుతున్నారు. సంగ్మాకే బిజెపి మద్దతిస్తోంది కానీ సంగ్మా మాత్రం బిజెపి అభ్యర్థిగా రంగంలోకి దిగలేదని గుర్తు చేస్తున్నారు.
అలాంటప్పుడు సంగ్మాకు మద్దతిస్తే బిజెపి అభ్యర్థికి మద్దతిచ్చినట్లు కాదని, అంతేకాకుండా సంగ్మాను బలపరిస్తే ఈశాన్య రాష్ట్రానికి చెందిన ఓ మైనార్టీ వర్గానికి చెందిన వెనుకబడిన వర్గాల నేతకు మద్దతిచ్చినట్లుగా అవుతుందని గుర్తు చేస్తున్నారు. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ కూడా తప్పులో కాలేసిందని చెబుతున్నారు.
గతంలో జగన్ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ, ప్రణబ్కు మద్దతివ్వడం, సబ్బం హరి వెళ్లి ప్రణబ్ను కలవడం, పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ఢిల్లీ వెళ్లినప్పుడు ప్రధానంగా తన తనయుడిని విడిపించడం పైనే దృష్టి సారించడం తదితర అంశాలు తరిచి చూస్తే జగన్ రాజీ నిర్ణయానికి వచ్చి ఉంటారని చెబుతున్నారు. అంతేకాదు విజయమ్మ ఇటీవల జగన్ పదిహేను రోజుల్లో బయటకు వస్తారని చెబుతున్నారు.