జగన్, కాంగ్రెసుతో కలిసి పోయారా?
టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు మొదటి నుండి కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు ఒక్కటేనని, జగన్ తన పార్టీని ఎప్పటికైనా మాతృ పార్టీలో కలపుతారనే చెబుతూ వస్తున్నారు. ఇటీవల కూడా ఆయన రెండు పార్టీలు ఒక్కటేనని మాట్లాడారు. మూడు రోజుల క్రితం మంత్రి వర్గం నుండి శంకర రావును తొలగించినప్పుడు టిడిపి నేతలు అనుమానాలు వ్యక్తం చేశారు. జగన్పై కేసు వేసిన దళితుడైన శంకర రావును తొలగించడం వెనుక కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు కలిసి పోవడమేనన్నారు. వారిద్దరి ఒప్పందంలో భాగంగానే శంకర రావును తొలగించి ఉండవచ్చునన్నారు.
జగన్ తన గుంటూరు జిల్లా ఓదార్పు యాత్రలో చంద్రబాబునే లక్ష్యంగా చేసుకున్నారు. ఇంతకుముందు బాబు, కాంగ్రెసుపై విరుచుకు పడేవారు. కానీ ఇప్పుడు మాత్రం కాంగ్రెసు నేతలపై డోసు తగ్గించి బాబుపై పెంచారనే వాదనలు వినిపిస్తున్నాయి. అలాగే జగన్ పేరు చెబుతేనే ఒంటికాలిపై లేచిన కాంగ్రెసు నేతలు ఇటీవలి కాలంలో ఆయన ఊసెత్తడం మానేశారు. వారు కూడా బాబునే టార్గెట్ చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు తదితర ఒకరిద్దరు నేతలు మినహా ఎవరూ జగన్పై విమర్శలు చేయడం లేదు.