కెసిఆర్ ఇలాకాపై జగన్ గురి: విజయమ్మ సై

ఇప్పుడు ఆమె చేపట్టబోయే దీక్ష ఏకంగా కెసిఆర్ ఎంపిగా ప్రాతినిథ్యం వహిస్తున్న పాలమూరులోనే అంటున్నారు. చేనేత దీక్ష అడ్డుకునేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి శ్రేణులు చేసిన ప్రయత్నాలు జగన్లో మరింత కసిని కలిగించాయట. అందుకే ఇప్పుడు ఆయన తన తల్లి విజయమ్మచే ఏకంగా కెసిఆర్ ఇలాకా పైనే గురి పెట్టారని అంటున్నారు. గత నెల 23న విజయమ్మ సిరిసిల్లలో చేనేత దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.
అయితే తెరాస శ్రేణులు ఆమెను హైదరాబాదు నుండే తీవ్రంగా అడ్డుకున్నారు. హైదరాబాద్ నుండి సిరిసిల్ల వరకు సాగిన విజయమ్మ యాత్రలో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఆమె కాన్వాయ్ పైన గుడ్లు, టమోటాలు, వాటర్ బాటిళ్లు విసిరారు. దీక్షా స్థలి వద్ద తెలంగాణవాదులు హంగామా చేశారు. ఈ ప్రతిఘటన కారణంగా ఆమె దీక్ష ఆలస్యంగా ఆరంభమవడమే కాకుండా అరగంట, గంట మధ్యనే ముగిసింది. ఈ ఘటనతో ఏకంగా శిఖరాన్నే కొట్టాలనే ఉద్దేశ్యంతో జగన్.. కెసిఆర్ నియోజకవర్గమైన పాలమూరులో తన తల్లిచే త్వరలో రైతుల కోసం దీక్ష చేపట్టే యోచనలో ఉన్నారట.
జగన్కు జిల్లాలో ఎవరి మద్దతైనా ఉందా అనే విషయంపై జోరుగా ఊహాగానాలు చెలరేగుతున్నాయి. తెలంగాణ నినాదంతో ఇటీవల టిడిపి నుండి బయటపడ్డ నాగర్ కర్నూలు శాసనసభ్యుడు నాగం జనార్ధన్ మద్దతు ఉందేమోననే అనుమానాలు తెలంగాణవాదులను వెంటాడుతున్నాయి. ఆయన టిడిపిని వీడినప్పుడు జగన్ వైపు వెళతారనే ప్రచారం జరిగింది. అయితే ఆయన మాత్రం వాటిని ఖండించారు.












Click it and Unblock the Notifications