మజ్లిస్ 'కొత్త' స్నేహం: కిరణ్కు పదవి గండం!

పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశాల మేరకు ఆమె రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి గులాం నబీ ఆజాద్, కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం, పార్టీ పరిశీలకుడు వయలార్ రవి, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ బుధవారం సాయంత్రం గంటల పాటు తాజా రాష్ట్ర పరిస్థితులపై చర్చించారు. రాష్ట్రంలో నెలకొన్న అయోమయాన్ని సాధ్యమైనంత త్వరగా తొలగించాలని వారు ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.
సోనియాతో చర్చించిన తర్వాత నిర్ణయాలుంటాయని చెబుతున్నారు. కాంగ్రెస్పై మజ్లిస్ నేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన ఆరోపణలు తీవ్రమైనవని అధిష్ఠానం భావిస్తోంది. ఓవైసీ విషయంలో రాష్ట్ర నాయకత్వం సరైన రాజకీయ దృక్పథంతో వ్యవహరించలేదని అధిష్ఠానం అభిప్రాయపడుతున్నట్లుగా సమాచారం. ఎన్నో ఏళ్లుగా సంబంధాలు ఉన్న మజ్లిస్తో రాష్ట్ర నాయకత్వం వల్లే చెడిందనే అభిప్రాయానికి వారు వచ్చినట్లుగా తెలుస్తోంది.
తెలంగాణ అంశాన్ని కూడా ఆలస్యం చేయకుండా ఓ నిర్ణయాన్ని వెలువరించాలనే అభిప్రాయానికి వచ్చారట. ఇప్పటికే అసంతృప్తుల బెడద కిరణ్ కుమార్ రెడ్డికి బాగా ఉంది. ఇప్పుడు మజ్లిస్ వ్యవహారంతో ఆయన అధిష్టానం విశ్వశనీయత మరింత కోల్పోయారని చెప్పవచ్చు. దీంతో ముఖ్యమంత్రి మార్పు అంశం మరోమారు తెరపైకి వచ్చింది. ఢిల్లీలో పార్టీ అగ్రనేతల సమావేశం నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో నాయకత్వ మార్పిడిపై తీవ్ర ఆసక్తి నెలకొంది.
పార్టీ పరిస్థితి నానాటికీ దిగజారి పోతోందని, 2014 ఎన్నికల్లో కనీసం గౌరవప్రదమైన స్థానాలైనా దక్కుతాయో లేదోనన్న సందేహాలు పార్టీ వర్గాల్లో నెలకొన్నాయి. ఢిల్లీ పెద్దల్లోనూ ఇదే అభిప్రాయం ఉందని, రాష్ట్ర సర్కారుకు ఎదురవుతున్న సమస్యలపై అధిష్ఠానం అసంతృప్తితో ఉన్నట్లుగా చెబుతున్నారు. రాష్ట్ర రాజకీయాలపై అధిష్ఠానం లోతైన అధ్యయనం చేస్తోందని, ఇందులో భాగంగానే రాజ్యసభ మాజీ సభ్యుడు కె.కేశవరావుతో కేంద్ర మంత్రి పల్లం రాజు మంగళవారం భేటీ అయినట్లు ఆయన పేర్కొన్నారు.
భాగ్యలక్ష్మి ఆలయ వివాదం ఒక్కటే ఇందుకు కారణం కాదని, ఇదంతా జగన్ పార్టీలోకి వెళ్లేందుకు ఎంఐఎం వేస్తోన్న ఎత్తుగడగా రాష్ట్ర్ట నేతల నుంచి అధిష్ఠానానికి నివేదికలు వెళ్లాయి. ఈ వ్యవహారం కిరణ్కు కాస్త ఇబ్బందికరమేనని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. తెలంగాణపై ఓ నిర్ణయం తీసుకున్నాకే రాష్ట్ర నాయకత్వ మార్పు విషయం ఆలోచించాలని తెలంగాణ నేతలు అధిష్టానాన్ని కోరుతున్నారట.
ఇప్పుడు సిఎంను మార్చడం వల్ల ప్రయోజనం ఉండదని, కొత్త నాయకుడు కుదురుకునే లోపే ఎన్నికలు ముంచుకొస్తాయని మరికొందరు చెబుతున్నారట. నాయకత్వ మార్పుపై చర్చ జోరుగా నడుస్తుండటం, ఎన్నికలు ఎక్కువ సమయం లేకపోవడం ఇలా చూస్తుంటే... మార్పు ఉంటుందా లేక ఎన్నికలు దగ్గరే ఉన్నందున కిరణ్కే అవకాశం ఇస్తారా అనే విషయం తేలక కాంగ్రెసు నేతలు ఆందోళన పడుతున్నారట.












Click it and Unblock the Notifications