సోనియా సీరియస్: నేతలకు ఆజాద్ క్లాస్

అటువంటి ప్రదర్శనతోనైనా నేతల మధ్య ఐక్యత ఉందనే సంకేతాలు ప్రజల్లోకి వెళతాయని, ఇప్పటి వరకూ ముఖ్యనేతలు ఎవరికి వారే అన్నట్లు ప్రచారం నిర్వహించడం వల్ల పార్టీలో అనైక్యత స్పష్టంగా కన్పిస్తోందని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్కుమార్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను ఉద్దేశించి ఆజాద్ చెప్పారు.
ఏకబిగిన మూడు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో సీఎం కిరణ్కుమార్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి, లోక్సభ సభ్యుడు కావూరి సాంబశివరావు, పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్, మాజీ మంత్రి మహమ్మద్ అలీ షబ్బీర్ పాల్గొన్నారు. సమావేశం ప్రారంభమైన వెంటనే గత రెండు సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల స్థితిగతుల గురించి ఆజాద్ ఆరా తీశారని, సహకార, మునిసిపల్, స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదని ముఖ్యమంత్రిని ఆయన నిలదీశారని అంటున్నారు.
సహకార ఎన్నికలకు సంబంధించి అందుబాటులో ఉన్న మంత్రులతో ఇటీవల సమావేశాన్ని నిర్వహించానని, వారందరూ ముక్తకంఠంతో సహకార ఎన్నికల కన్నా ముందుగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు ప్రాధాన్యం ఇద్దామని సూచించారని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆజాద్కు వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సహకార ఎన్నికలను వాయిదా వేయాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. ఈ ఎన్నికలను జూలై నెలలో నిర్వహిస్తామని కిరణ్ చెప్పారు. అయితే, ఈ నిర్ణయానికి సమన్వయ కమిటీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
పిసిసి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి తనకు ఇచ్చిన అభ్యర్థుల జాబితాను చదవుతానని, అభ్యంతరం వ్యక్తం చేసిన పేర్లను పక్కన పెడతానని, మిగిలినవాటిని ఖరారు చేస్తానని, ఈ విషయంలో ఎవరకీ సందేహం అక్కర్లేదని ఆజాద్ మిగతా సమన్వయ కమిటీ సభ్యులతో అన్నారు. అనంతపురం అర్బన్ స్థానాన్ని ముస్లింకు గానీ బలిజ సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి గానీ ఇవ్వాలనే సూచన వచ్చింది. బలమైన ముస్లిం అభ్యర్థిని ఎంపిక చేయాలని షబ్బీర్ అలీ చెప్పినట్లు తెలుస్తోంది.
కడప జిల్లా రాయచోటి, రాజంపేట సీట్ల విషయంలో ముఖ్యమంత్రి ఎంపిక చేసిన అభ్యర్థులపై వ్యతిరేకత ఎదురైంది. రాయలసీమలో బలిజ వర్గానికి అవకాశం ఇవ్వాలని చిరంజీవి కోరారు. రాయచోటి, రాజంపేట, అనంతపురంలలో ఒక స్థానాన్ని బలిజలకు కేటాయించాలని, ఇందుకోసం అభ్యర్థులను ఎంపిక చేయాలని సూచించారు. చిరంజీవి సూచనతో డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ ఏకీభవిస్తూనే, ముస్లిం అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలని కోరారు.
పరకాల నుంచి బీసీ అభ్యర్థిని రంగంలోకి దించాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. దాని వల్ల ముందుగా అనుకున్నట్లు ప్రభుత్వ చీఫ్విప్ గండ్ర వెంకట రమణారెడ్డి భార్య జ్యోతికి బదులు సమ్మారావు పేరు ప్రస్తావనకు వచ్చింది. పోలవరం స్థానం గురించి చర్చకు వచ్చినప్పుడు బొజ్జి దొర కంటే శ్రీనివాసరావు అభ్యర్థిత్వం పట్లే పలువురు మొగ్గు చూపారు. ఈ సమయంలో కావూరి జోక్యం చేసుకుంటూ శ్రీనివాసరావు అభ్యర్థిత్వమే మంచిదని అన్నారు. మొత్తం మీద, ఆదివారంనాటి సమావేశం వేడివేడిగా సాగింది.












Click it and Unblock the Notifications