తెలంగాణ రిస్క్: చంద్రబాబుకు ఓ సవాల్

తెలంగాణపై చంద్రబాబు స్పష్టతతో ఉన్నారని, నేడోరేపో లేఖ ఇవ్వనున్నారని ఆ ప్రాంత నేతలు ఆశాభావంతో ఉన్నారు. అయితే, ఈ విషయంపై మౌనంగా ఉంటూ వస్తున్న కోస్తా, రాయలసీమ ప్రాంత నేతలు మాత్రం మెలిక పెడుతున్నట్లు సమాచారం. ఇది ఆషామాషీగా తీసుకునే నిర్ణయం కాదంటూ మాట్లాడుతున్నట్లు తెలుస్తోది.
తెలంగాణపై లేఖకు సంబంధించి తెలుగుదేశం పార్టీలో ప్రధానంగా మూడు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీ గతంలో తీసుకొన్న నిర్ణయాన్ని పునరుద్ఘాటిస్తూ లేఖ ఇవ్వాలని మాత్రమే తాము కోరుతున్నామని, ఇది ఎవరికీ ఇబ్బందికరం కాదన్నది తెలంగాణ ప్రాంత నేతల వాదన. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు మద్దతిస్తూ 2008లో టీడీపీ అధికారికంగా తీర్మానించి దాని ప్రతిని ప్రణబ్ముఖర్జీ కమిటీకి పంపింది. కానీ, అప్పుడు కేంద్రం దాన్ని పట్టించుకోకపోవడంతో ఏ నిర్ణయం వెలువడలేదు.
2009లో తెలంగాణ రాష్ట్ర ఏర్పా టు ప్రకటన, ఆ తర్వాత అన్ని పార్టీలూ ప్రాంతాల వారీగా చీలిపోవడంతో తెలుగుదేశం నుంచి మరోసారి లేఖ కోసం తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెసు నుంచి డిమాండ్ పెరిగింది. పాత లేఖనే మరోసారి ఇస్తే తెలంగాణ ప్రాంతంలో ఇక తెలుగుదేశం పార్టీని ఎవరూ ఏమీ అనలేరని, దీనివల్ల ఈ ప్రాంతంలో పార్టీ మళ్లీ పుంజుకునే అవకాశం ఉంటుందని ఈ ప్రాంత నేతల వాదన.
లేఖ ఇచ్చాక పర్యవసానాలను తాము అనుభవించాల్సి ఉంటుందని, అందుకే ముందు ఇతర పార్టీలను ఇందులో ఇరికించే మార్గం చూసుకోవాలని, కళ్లు మూసుకు వెళ్లడం సరికాదని కొంత మంది సీమాంధ్ర నేతలు స్పష్టం చేస్తున్నారు. తాము లేఖ ఇచ్చినా కేంద్రం పట్టించుకోకపోతే ఫరవా లేదు గానీ తమ లేఖ వల్ల కాంగ్రెసుపై ఒత్తిడి పెరిగి రాష్ట్ర విభజనకు దారి తీస్తే ఎలా అనేది సీమాంధ్ర నాయకుల సంశయం. తమ లేఖవల్లనే రాష్ట్ర విభజన జరిగిందని సీమాంధ్రలో ప్రజలు ఆగ్రహిస్తే ఎలా అనేది వారి ప్రశ్న.
ఈ స్థితిలో సీమాంధ్ర నాయకుల వైపునుంచి ఈ దిశగా రెండు రకాల ప్రతిపాదనలు వస్తున్నాయి. తెలంగాణకు అనుకూలమేనని పార్టీ తరఫున ప్రకటించిండని, కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు లేఖ ఇచ్చిన తర్వాత తాము లేఖ ఇస్తామని మెలిక పెట్టండని వారు సూచిస్తున్నట్లు సమాచారం. దాని వల్ల ఆ పార్టీలపై కూడా ఒత్తిడి పెరుగుతుందని వారంటున్నారు.
ఈ రెండు సూచనలు ఇప్పటికే చంద్రబాబు వద్దకు చేరాయి. ఇక రాయలసీమ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తలెత్తిన సీమ రాష్ట్రం ఉద్యమం ఈ వ్యవహారంలో మరో కోణం. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇస్తే రాయలసీమ రాష్ట్రానికీ సానుకూలత వ్యక్తం చేస్తూ అందులో పేర్కొనాలని వీరు కోరుతున్నారు. టీడీపీ నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఇందులో క్రియాశీలంగా ఉన్నారు.
తెలంగాణ ఇవ్వదలుచుకుంటే రాయలసీమ రాష్ట్రం కూడా ఏర్పాటు చేయాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. ఈ స్థితిలో చంద్రబాబు తుది నిర్ణయం ఎలా ఉంటుందన్నది ఇప్పుడు పార్టీలో అనేక మందికి ఆసక్తి కలిగిస్తోంది.












Click it and Unblock the Notifications