కొండా సురేఖపై జగన్ ఆగ్రహం వెనుక..!
మొదటి నుండి తమకు అండగా ఉన్న ఈ కొండా దంపతుల పైన జగన్ కూడా అసంతృప్తితో, ఆగ్రహంతోనే ఉన్నారట. ఆయన అసంతృప్తి, పార్టీ అధిష్టానం కొండా వర్గంపై తీవ్రంగా స్పందించడం... వారి స్వయంకృపారాధమే అంటున్నారు. తన కోసం మంత్రి పదవిని, అధికారంలో ఉన్న పార్టీని తృణపాయంగా వదిలిన కొండా దంపతులకు జగన్ అధిక ప్రాధాన్యమే ఇచ్చారని, వారు మాత్రం జగన్, పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మలను తప్పితే ఇతరుల పట్ల డోంట్ కేర్ అన్న చందంగా ఉండటమే కారణమనే ప్రచారం సాగుతోంది.
జిల్లాలోని నియామకాల పైన, జిల్లాలో పార్టీలోకి చేరికల పైన తమదే సాగాలని అధిష్టానానికి హుకూం జారీ చేశారట. ఇటీవల జిల్లా పార్టీ కార్యాలయానికి కొండా వర్గం నేతలు తాళం కూడా వేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందేనని అధిష్టానం గట్టిగా భావించిందట. కొండా దంపతుల తీరుపై అసంతృప్తితో ఉన్న జగన్ కూడా దానిని వ్యతిరేకించలేదని తెలుస్తోంది. దీంతో అధిష్టానం నలుగురుపై వేటు వేసింది.
కొండా దంపతులు అసంతృప్తిగా లేరని, వారు పార్టీలోనే ఉంటారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చెబుతున్నా ఇప్పటి వరకు వారు బయటకు వచ్చి మాట్లాడింది లేదు. దీనికి తోడు నలుగురుపై వేటు వేయడం వారిని మరింత ఆగ్రహానికి గురి చేసిందట. దీంతో పార్టీకి దూరం కావాలనే నిర్ణయానికి దాదాపుగా వచ్చేశారని అంటున్నారు. అయితే, ఏ పార్టీలో చేరాలనే విషయమై వారు తర్జన భర్జన పడుతున్నారట.