బైరెడ్డి: సీమ కెసిఆర్ కావాలనుకుంటున్నారా?
తెలంగాణవాదులు ఓవైపు, సమైక్యవాదులు మరోవైపు ఢిల్లీలో మూడు రోజుల క్రితం వరకు లాబీయింగ్ చేశారు. ఆ తర్వాత కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యలు లాబీయింగుకు తెర వేశాయి. ఆయన వ్యాఖ్యలు తెలంగాణవాదుల్లో నిరుత్సాహం, సమైక్యాంధ్రవాదుల్లో ఉత్సాహాన్ని నింపాయి. ఓ వైపు తెలంగాణ, మరోవైపు సమైక్యాంధ్ర ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసిన సమయంలో బైరెడ్డి మాత్రం రాయలసీమ అంటూ పోరాటం చేస్తున్నారు.
దీంతో ఆయన రాయలసీమలో మరో కెసిఆర్ కావాలనుకుంటున్నట్లుగా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణ ఉద్యమం ఎప్పటి నుండో ఉన్నప్పటికీ 2009లో కెసిఆర్ దీక్ష, కేంద్రం ప్రకటన నేపథ్యంలో తెలంగాణవాదం తారాస్థాయికి చేరుకుంది. ఆ తర్వాత తెలంగాణలో కెసిఆర్ హీరో అయిపోయారు. ఇప్పుడు తెలంగాణకు అనుకూలంగా కేంద్రం నుండి 2014 ఎన్నికల లోపు ప్రకటన వస్తుందనే వాదనలు ఉన్నాయి.
దీంతో రాష్ట్రాన్ని రెండుగా కాకుండా మూడుగా విభజించాలని బైరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. దాదాపు సీమాంధ్ర నేతలు అందరూ విభజన జరగదని కుండబద్దలు కొడుతుండగా బైరెడ్డి మాత్రం తెలంగాణపై ఇప్పటికే కేంద్రం ఓ నిర్ణయం తీసేసుకుందని, ప్రకటనే ఆలస్యమన్నారు. ఈ నేపథ్యంలో తమ ప్రాంతాన్ని ఇటు తెలంగాణలో అటు ఆంధ్రలో కలపకుండా ఉండేందుకు తాను ఉద్యమిస్తున్నానని చెబుతున్నారు. ఇప్పటికే తాము ఎంతో నష్టపోయామని, ఏ ప్రాంతంలో కలిపినా మళ్లీ నష్టపోవాల్సి ఉంటుందని, కాబట్టి ఎందులోనూ కలుపకుండా ప్రత్యేక రాయలసీమను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే పలువురు సీమ నేతల వాదన మాత్రం మరోలా ఉండటం గమనార్హం.