సబిత బుక్!: జగన్ కేసులో మంత్రుల టెన్షన్
దీంతో, మిగిలిన ముగ్గురు మంత్రుల్లోనూ హై టెన్షన్ మొదలైంది. మరోవైపు, ఇప్పటికే ధర్మాన వ్యవహారంతోనే తలబొప్పి కట్టిన ప్రభుత్వం తాజాగా సబిత పేరు కూడా చార్జిషీటులో చేరడంతో పూర్తిగా ఇరుకున పడింది. మంత్రి ధర్మాన ప్రాసిక్యూషన్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుబడుతూ సిబిఐ తరఫున జగన్ కేసును వాదిస్తున్న ప్రముఖ న్యాయవాది అశోక్ భాన్ చేసిన వ్యాఖ్యల వేడి తగ్గకముందే సాక్షాత్తూ హోం మంత్రి నిందితురాలి జాబితాలో చేరడం ప్రభుత్వాన్ని చిక్కుల్లోకి నెట్టేసిందనే చెప్పవచ్చు.
ఇప్పటికే ధర్మాన నిందితునిగా బోనెక్కారు. ఇది విపక్షాలకు ఓ అస్త్రంగా మారింది. ఇటు విపక్షంలోనూ అటు స్వపక్షంలోనూ ధర్మాన అంశం చర్చనీయాంశమైంది. కొన్ని నెలల తర్జన భర్జనలు మల్లగుల్లాలు పడిన తర్వాత, మరో సీనియర్ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి అభ్యంతరం చెప్పినా ధర్మానకు అండగా నిలవాలని కేబినెట్ నిర్ణయించింది. ఇక, సిబిఐ తదుపరి చార్జిషీట్లలో మంత్రులు గీతా రెడ్డి, పొన్నాల లక్ష్మయ్యలు తప్పించుకోలేరేమోనని అంటున్నారు.
అదే జరిగితే, ప్రభుత్వానికి మరిన్ని తలవంపులు తప్పవని భావిస్తున్నారు. గతంలో ఓఎంసి కేసులోనే సబితను అరెస్టు చేస్తారన్న ప్రచారం అప్పట్లో జోరుగా సాగింది. అయితే, తనను సాక్షిగానే సిబిఐ పిలిచి విచారించిందని సబిత తెలిపారు. కానీ, దాల్మియా సిమెంట్స్కు గనుల కేటాయింపునకు సంబంధించి సిబిఐ తాజా చార్జిషీట్లో ఆమె నిందితురాలి జబితాలో చేరారు. హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ సబిత నిందితురాలిగా ఉండడం ప్రభుత్వంపై ప్రభావం చూపనుందని పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
బహుశా హోం మంత్రి హోదాలో బాధ్యతలు నిర్వహిస్తూ నిందితురాలిగా కోర్టు గుమ్మం ఎక్కడం దేశ చరిత్రలో అరుదైన ఘట్టంగా భావిస్తున్నారు. కాగా, సిబిఐ చార్జిషీట్ల పరంపరను కొనసాగించనున్న నేపథ్యంలో తమ భవిష్యత్ ఏమిటన్న దిగులు మిగిలిన మంత్రుల్లో కనిపిస్తోంది. జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తులో భాగంగా మంత్రి మోపిదేవిని అరెస్టు అయిన విషయం తెలిసిందే.