మూడుకు వంద: బాబు టెన్షన్, లోకేష్ వద్దకు క్యూ
ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థుల ఖరారు గడువు సమీపిస్తున్న కొద్దీ పార్టీలో ఆశావహుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. అభ్యర్థుల ఎంపిక బాబుకు క్లిష్టంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూడు నాలుగు రోజుల్లో అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉండగా బాబుకు ఇంకా వినతులు అందుతూనే ఉన్నాయి. బాబు తనయుడు నారా లోకేష్, బావమరిది బాలకృష్ణల వద్దకు కూడా నేతలు క్యూ కడుతున్నారట. గుంటూరు జిల్లాకు చెందిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి సాంబశివ రావు తాజాగా ఎమ్మెల్సీ పదవి కోసం బాబుకు వినతిపత్రం పంపారు.
కాపు సామాజిక వర్గం నుంచి తనకు అవకాశం ఇవ్వడం పార్టీకి ఉపకరిస్తుందని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పార్టీని వీడినందున తన ఎంపిక ఆ లోటును భర్తీ చేస్తుందని ఆయన చెప్పారు. మండలిలో ప్రతిపక్ష నేత దాడి వీరభద్ర రావుకు మళ్లీ అవకాశం వస్తుందా లేదా అన్న దానిపైనే కోస్తా నుంచి ఇతరుల పేర్ల పరిశీలన ఆధారపడి ఉంది. ఆయనను ఎంపిగా నిలపాలని బాబు భావిస్తే మళ్లీ ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వకపోవచ్చునని అంటున్నారు.
దాడి కాని పక్షంలో ఆ ప్రాంతం నుంచి ప్రతిభా భారతితో పాటు మరో ఇద్దరి పేర్లను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఉత్తరాంధ్ర నుంచి దాడి ఎంపిక జరిగితే ప్రతిభా భారతి పేరు వెనక్కు వెళ్లిపోవచ్చునని పార్టీ వర్గాలు అంటున్నాయి. తెలంగాణ నుంచి ఎవరికి అవకాశం వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. మైనారిటీలకు అవకాశం ఇవ్వదలిస్తే వక్ఫ్బోర్డు మాజీ అధ్యక్షుడు సలీం, రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం ఇస్తే మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే వేం నరేంద్ర రెడ్డికి చాన్స్ రావడం ఖాయమని అంటున్నారు.
మరోవైపు పద్నాలుగేళ్లుగా పార్టీ మీడియా విభాగానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఎల్విఎస్ఆర్కె ప్రసాద్ కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నారట. రాయలసీమ నుంచి బిసి నేత కాల్వ శ్రీనివాసులుతో పాటు మరో మహిళా నేత రేసులో ఉన్నారు. త్వరలో జరిగే పొలిట్బ్యూరో సమావేశంలో దీనిపై చర్చ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మూడు సీట్లు మాత్రమే ఉండగా ఇన్ని విజ్ఞప్తులు అందుతుండటంతో బాబు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారట. మరోవైపు ఎమ్మెల్సీ సీటు పైన సిపిఐ కూడా దృష్టి సారిస్తోంది. ప్రస్తుతం మండలిలో పార్టీ నేత జల్లి విల్సన్ రిటైర్ అవుతున్నారు. ఆ స్థానానికి తిరిగి తమ పార్టీ అభ్యర్థినే బలపరచాలని టిడిపిని కోరే యోచనలో సిపిఐ ఉంది.