వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిపి టికెట్ల పంపకం: సైకిల్‌పై స్వారీకి ఇద్దరు

By Pratap
|
Google Oneindia TeluguNews

Family members in TDP to get two seats
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీలో కొంత మంది విశేషంగా లాభపడుతున్నారు. ఒకే కుటుంబంలోని ఇద్దరు టికెట్లు పొందుతూ రాజకీయాలు రంజుగా నడుపుతున్నారు. సైకిల్‌పై ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్తలో, అన్నదమ్ములో - ఇలా సైకిల్‌పై ఎన్నికల్లో ఇద్దరేసి స్వారీ చేయడానికి అవకాశం దక్కుతోంది. తెలుగుదేశం పార్టీలోని కొంతమంది సీనియర్లు ఈసారి తమకు తోడు వారసులను రంగంలోకి దింపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు నాయకులు ఎన్నికల బరిలోకి దిగిన ఉదంతాలపై, ప్రస్తుతం అలాంటి అవకాశాల కోసం ప్రయత్నాలు సాగిస్తున్న కుటుంబాల వైనంపై ఓ తెలుగు దినపత్రికలో సవివరమైన కథనం వచ్చింది.

గత ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో కెఇ సోదరులు కృష్ణమూర్తి, ప్రభాకర్ ఇద్దరూ ఎమ్మెల్యే టికెట్లు తెచ్చుకొని గెలిచారు. ఈసారి కూడా వారికే టికెట్లు ఖాయంగా కనిపిస్తోంది. అయితే, కృష్ణమూర్తిని ఈసారి ఎంపీగా నిలబెట్టాలని పార్టీ వర్గాల నుంచి ఒత్తిడి వస్తోంది. ఇక, మహబూబ్‌నగర్ జిల్లాలో భార్యాభర్తలు కొత్తకోట దయాకర రెడ్డి, కొత్తకోట సీత ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఈసారి కూడా ఈ ఇద్దరూ ఎమ్మెల్యేలుగా పోటీ చేయడమో లేదా సీత ఎంపీగా పోటీ చేయడమో జరిగే అవకాశం ఉందంటున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో అన్నదమ్ములు ఎర్రన్నాయుడు, అచ్చెన్నాయుడు ఇద్దరికీ టికెట్లు వచ్చాయి. కానీ, ఇద్దరూ గెలవలేదు. ఎర్రన్నాయుడు ఆకస్మిక మృతితో ఆయన కుమారుడు రామ్మోహన నాయుడు ఈసారి ఎంపిగా పోటీ చేయనున్నారు. అచ్చెన్నాయుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో భార్యాభర్తలు రమేశ్ రాథోడ్, సుమన్ రాథోడ్ ఒకరు ఎంపీగా మరొకరు ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ, సుమన్ 'గిరిజన' వివాదంలో కోర్టు కేసుల్లో చిక్కుకొన్నారు. ఈసారి ఆమె బదులు కుమారుడు రితీష్ రాథోడ్ రంగంలోకి రాబోతున్నారు.

కొత్తగా ఈసారి రెండో టికెట్ కోసం ప్రయత్నిస్తున్న వారిలో ముద్దుకృష్ణమ నాయుడు కుటుంబం ప్రముఖంగా కనిపిస్తోంది. ఆయన ప్రస్తుతం చిత్తూరు జిల్లా నగరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి తన కుమారుడు జగదీష్‌ను నగరి నుంచి రంగంలోకి దించి తాను చంద్రగిరి, పలమనేరు, మదనపల్లిల్లో ఒకదాని నుంచి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు. పార్టీ నాయకత్వం ఒకటే టికెట్ ఇస్తే తాను తప్పుకొని తన కొడుకును నిలుపుతానని, రెండోచోట అవకాశం ఇస్తే తానూ నిలబడతానని సన్నిహితులకు చెబుతున్నారు.

నిజామాబాద్ జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణమ్మ ఈసారి తనతోపాటు తన కొడుకు మల్లికార్జున రెడ్డికి కూడా సీటు సాధించాలని పట్టుదలతో ఉన్నారు. అక్కడ ఇతరత్రా సీనియర్లు లేకపోవడం ఆమె ప్రయత్నాలకు కొంత సానుకూలంగా ఉంది. రంగారెడ్డి జిల్లాలో తాండూరు నియోజకవర్గం శాసనసభ్యుడు పట్నం మహేందర్ రెడ్డి కుటుంబానికి ఈసారి మరో టికెట్ వస్తోంది. ఆయన తమ్ముడు నరేందర్ రెడ్డి ఇప్పటికే పరిగి సీటుకు ఇన్‌చార్జిగా ఉన్నారు. మహేందర్ రెడ్డి భార్య సునీత పేరు చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గానికి పరిశీలనలో ఉంది.

అదే జిల్లాలో ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా ఉన్న దేవేందర్ గౌడ్ ఈసారి తన కుమారుడు వీరేశ్‌ను ఉప్పల్ అసెంబ్లీ సీటు నుంచి పోటీకి నిలపడానికి ప్రయత్నిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోనే ప్రస్తుతం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేగా ఉన్న మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కుమారుడు ప్రశాంత్ రెడ్డి ఈసారి సికింద్రాబాద్ ఎంపీ టికెట్ కోసం గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. తన స్థానంలో తన సోదరుడు తిరుపతి రెడ్డిని ఇప్పటికే నియోజక వర్గంలో పూర్తి స్థాయిలో తిప్పుతున్నారు.

శాసన మండలిలో ఇటీవలి వరకూ ప్రతిపక్ష నేతగా ఉన్న దాడి వీరభద్రరావు కుటుంబానికి కూడా ఈసారి రెండు సీట్లు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఆయన కొడుకు రత్నాకర్ ప్రస్తుతం అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్నారు. దాడి వీరభద్రరావు అనకాపల్లి పార్లమెంటు సీటుకు పోటీ చేసే అవకాశాలు బలంగా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఎమ్మెల్సీగా ఎన్నికైన యనమల రామకృష్ణుడు కుటుంబానికి కూడా ఈసారి రెండో టికెట్ వచ్చింది. యనమల స్థానంలో ఈసారి తుని నుంచి ఆయన సోదరుడు పోటీ చేయబోతున్నారు.

English summary

 Two leaders from single family trying for Telugudesam party tickets in the elections incidents are increasing. Several leaders are trying for TDP tickets for their kin and kith.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X