కిరణ్ రెడ్డిపై చిరు వర్గం కొత్త ఎత్తు: కాపు ఎజెండా
చిరంజీవి ముఖ్యమంత్రి కావాలన్న డిమాండ్ను తెరపైకి తెచ్చిన రామచంద్రయ్య దీనికి నాయకత్వం వహించడంతో అనేక అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. కొన్నేళ్ల నుంచి నలుగుతున్న కాపులను బీసీల్లో చేర్పించాలన్న డిమాండ్ ఇప్పుడు రాజకీయాస్త్రంగా మారింది. రామచంద్రయ్య నిర్వహించిన సమావేశానికి మంత్రులు గంటా శ్రీనివాసరావు, వట్టి వసంతకుమార్తో పాటు 8 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ఇటీవల కాలంలో ముఖ్యమంత్రిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వట్టి వసంత కుమార్ కూడా హాజరు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అదే కాపు వర్గానికి చెందిన మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, తోట నర్శింహం గైర్హాజరయ్యారు. కాపులను బీసీల్లో చేర్పించాలన్న డిమాండ్ పైనే ఎక్కువగా చర్చించినట్లు సమాచారం. అధికారపార్టీలో ఉన్నప్పటికీ తగిన గౌరవం లభించడం లేదని, కాపు వర్గానికి చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు సరైన పోస్టింగులు లభించడం లేదని, 5,6 శాతం ఉన్న సామాజిక వర్గాలకే గౌరవం లభిస్తున్నట్లు సమావేశంలో ఆవేదన వ్యక్తమైనట్లు తెలుస్తోంది.
అధికారంలో ఉన్నప్పటికీ, తమకు సరైన గౌరవం లభించడం లేదన్న ఆవేదన ఉందని రామచంద్రయ్య వ్యాఖ్యానించినట్లు సమాచారం. కాపులను బీసీల్లో చేర్పించే దాకా వదలిపెట్టవద్దని, కిరణ్పై ఒత్తిడి చేయాలని, కాపు సర్వేకు సంబంధించిన నిధులను విడుదల చేయించుకునేందుకు ఒత్తిడి చేయాలని సూచించారు. ఎన్నికల్లో బీసీల్లో చేరుస్తామన్న హామీ ఇచ్చి దానిని కాంగ్రెస్ నెరవేర్చడం లేదన్న ఆగ్రహం ఉందని, ఎన్నికల్లో కాపులంతా కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఓటు వేసే పరిస్థితి ఉందని రామచంద్రయ్య వ్యాఖ్యానించినట్లు సమాచారం.
రామచంద్రయ్య నిర్వహించిన సమావేశం వెనుక చిరంజీవి ప్రోత్సాహం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమావేశానికి హాజరయిన వారిలో ఎక్కువమంది చిరంజీవి ప్రజారాజ్యం నుంచి వచ్చినవారే కావడంతో ఇలాంటి అనుమానాలకు తావిస్తోంది. సమావేశం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రిని మారుస్తున్నారన్న ప్రచారం ఊపందుకుంది. అయితే, అసలు సమావేశంలో ముఖ్యమంత్రి ప్రస్తావనే రాలేదని ఓ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.