మజ్లిస్ అడ్డాలో నో: హైదరాబాద్పై కెసిఆర్ పావులు
పార్టీ బలహీనంగా ఉందని విమర్శలున్న గ్రేటర్ హైదరాబాద్ నుంచే శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు కెసిఆర్ గురువారం ఇక్కడ తెలంగాణ భవన్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పార్టీ నియోజకవర్గ ఇన్చార్జులతో భేటీ అయ్యారు. ఏప్రిల్ 2 నుంచి రెండు విడతల్లో బస్తీ బాట చేపట్టాలని వారిని ఆదేశించారు. తొలి విడత ఏప్రిల్ 2 నుంచి 9 వరకు, రెండో విడత ఏప్రిల్ 12 నుంచి 19 వరకు బస్తీబాట నిర్వహణ షెడ్యూల్ను ఖరారు చేశారు.
మజ్లిస్ పాగా వేసిన హైదరాబాద్ను పక్కన పెడితే, తెలంగాణలోని మిగిలిన లోక్సభ స్థానాలతో పోల్చితే సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల స్థానాల్లో బలహీనంగా ఉన్నామనే భావనలో తెరాస నాయకత్వం ఉంది. అందుకే బస్తీ బాటను ఈ మూడు లోక్సభ నియోజకవర్గాల పరిధిలో నిర్వహించబోతున్నారు. ఇందుకోసం సిద్ధం కావాలని పార్టీ గ్రేటర్ హైదరాబాద్ ఇన్చార్జులను ఆదేశించిన కెసిఆర్, ఈ బస్తీబాట ముగిశాక, జిల్లాల్లో ఎన్నికల కోణంలో కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించారు.
నగరంలోని ప్రతి డివిజన్కు నగరేతర ప్రాంతానికి చెందిన నియోజకవర్గాల్లోని ఒక నేతను ఇంఛార్జిగా నియమిస్తామని కెసిఆర్ చెప్పారు. డివిజన్ పరిధిలో పార్టీలో చురుగ్గా పని చేసే మరో పదిమంది, స్థానిక నేతలు పదిమంది, మొత్తం ఇరవై మందితో ఒ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. వీరు నిత్యం పర్యటించి పార్టీని పటిష్టం చేయాలని సూచించారు. దీనిపై 30 నాటి సమావేశంలో కొంత కసరత్తు జరిగే అవకాశం ఉందని పార్టీ ముఖ్యులు తెలిపారు.
తెలంగాణ విషయంలో అధికార కాంగ్రెస్పై తమ పార్టీకి స్పష్టత వస్తేనే క్షేత్రస్థాయిలో కేడర్ సాఫీగా ముందుకు సాగిపోయే వీలుంటుందని, అప్పటి వరకు ఎన్ని కార్యక్రమాలు నిర్వహించినా చెప్పుకోదగ్గ ఫలితం ఉండకపోవచ్చని కొందరు అభిప్రాయపడ్డారట. అయితే, మజ్లిస్ అడ్డా హైదరాబాద్ మినహా గ్రేటర్ పైన కెసిఆర్ ప్రత్యేకంగా దృష్టి సారిస్తుండటం పార్టీ వర్గాల్లోను ఆనందం నింపుతోంది.