మీడియా, యాత్రలు: కిరణ్ చేతికి కృష్ణాపత్రిక
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రోజురోజుకూ బలం పుంజుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆయన అన్ని వైపుల నుంచి తగిన బలాన్ని సమకూర్చునే ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. జిల్లాల్లో పర్యటనలు చేయడం ద్వారానే కాకుండా బలమైన మీడియాను రూపొందించుకోవడం ద్వారా కూడా తన సత్తాను చాటి, 2014 ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నట్లు చెబుతున్నారు.
ముఖ్యమంత్రి సోదరుడు మీడియాను రూపుదిద్దే కార్యక్రమంలో ఉన్నట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రి ఆధీనంలోకి ఇప్పటికే ఐన్యూస్ అనే టీవీ న్యూస్ చానెల్ వచ్చినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో కృష్ణాపత్రికను కూడా ముఖ్యమంత్రి సోదరుడు కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. ఈ పత్రిక పిరాట్ల వెంకటేశ్వర్లు అనే జర్నలిస్టు చేతిలో ఉంది. ముట్నూరి కృష్ణారావు ఈ పత్రికను స్థాపించారు. ఆ పత్రికకు మంచి చరిత్ర ఉంది.
ముట్నూరు కృష్ణారావు కుటుంబం నుంచి కృష్ణా పత్రికను తీసుకున్న పిరాట్ల కృష్ణారావు తన స్థాయిలో నడుపుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు అది కిరణ్ కుమార్ రెడ్డి స్వాధీనంలోకి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఈ వార్తలో నిజం ఎంత ఉందనేది నిర్ధారణ కావడం లేదు. కానీ, కృష్ణాపత్రికను ముఖ్యమంత్రి సోదరుడు త్వరలో పెద్ద స్థాయిలో ముందుకు తెస్తారనే ప్రచారం జరుగుతోంది.

ఇదిలావుంటే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జిల్లా పర్యటనల ద్వారా, తనవైన ముద్ర వేసే పథకాల ధర సొంత ముద్రను వేయడానికి ప్రయత్నిస్తున్నారు. రాజీవ్ యువకిరణాలు వంటి పథకాలను ఆయన ప్రవేశపెట్టారు. ఆ పథకాల ద్వారా వైయస్ రాజశేఖర రెడ్డి ముద్రను చెరిపేసి, తన ముద్రను వేయాలని చూస్తున్నారు.
జిల్లా పర్యటనల్లో ఆయన పార్టీలోని ప్రత్యర్థులను తన వైపు తిప్పుకుంటూ, ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు దీటైన సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి శనివారం చిత్తూరు జిల్లాలో పర్యటించారు. నల్లగొండ జిల్లాలో సూర్యాపేట శాసనసభ్యుడు ఆర్ దామోదర్ రెడ్డిని తన వైపు తిప్పుకున్నారు.
తెలంగాణవాదం పేరుతో ముఖ్యమంత్రిని వ్యతిరేకిస్తూ వచ్చిన దామోదర్ రెడ్డి శుక్రవారం బహిరంగ సభలో ఆయనపై ప్రశంసల జల్లు కురిపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ను పక్కన పెట్టేసి 2014 ఎన్నికల తర్వాత కూడా కిరణ్ కుమార్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారని దామోదర్ రెడ్డి అన్నారు. ఈ రకంగా పార్టీకి చెందిన నాయకులను మెల్లగా తన వైపు తిప్పుకునే వ్యూహాన్ని ఆయన అనుసరిస్తున్నారు. మంత్రివర్గంలో కూడా తనదైన గ్రూపును ఆయన ఏర్పాటు చేసుకున్నారు.












Click it and Unblock the Notifications