ఓవైసీ బ్రదర్స్కు కిరణ్ రెడ్డి ప్రభుత్వం మరో షాక్

ఆ దినపత్రిక కథనం ప్రకారం - ఒవైసీ ఆస్పత్రి వెనుక దాదాపు 2.57 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. మహ్మద్ షరీఫుద్దీన్, మరో ఆరుగురు ఆ భూమి తమదంటూ పత్రాలు చూపించి అప్పట్లో హైదరాబాద్ కలెక్టర్గా ఉన్న నవీన్ మిట్టల్ నుంచి నిరభ్యంతర పత్రం(ఎన్ఓసీ) పొందారు. దీంతో కోట్ల విలువచేసే ప్రభుత్వ భూమిపై ప్రైవేటు వ్యక్తులకు హక్కులు కల్పించారని ప్రజాసంఘాలు ఆందోళన కూడా చేశాయి. హైదరాబాద్ కలెక్టర్గా నటరాజన్ గుల్జార్ వచ్చాక అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములపై అధ్యయనం చేయించారు.
మిథాని భూమి ఎన్ఓసీని కూడా సమీక్షించారు. ఒవైసీ ఆస్పత్రిలో కలిపేసిన భూమి ప్రభుత్వానిదేనని, నవీన్మిట్టల్ ఇచ్చిన ఎన్ఓసీ చెల్లదని, వెంటనే దాన్ని రద్దు చేయాలని భూ పరిపాలనా ప్రధాన కమిషనర్(సీసీఎల్ఏ)కు కలెక్టర్ లేఖ రాశారు. దీని ఆధారంగా కేసును నిశితంగా పరిశీలించాక సీసీఎల్ఏ 2012లో ఎన్ఓసీని రద్దుచేశారు.
ఆ వ్యవహారం నడిచిన కాలంలో మజ్లిస్కు కాంగ్రెస్తో మంచి సంబంధాలు ఉన్నాయి. రాజకీయ ఒత్తిళ్లు పనిచేయడంతో సీసీఎల్ఏ ఇచ్చిన ఎన్ఓసీ రద్దు ఉత్తర్వులపై అప్పటి రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ చంద్రపునేఠ స్టే ఉత్తర్వులు ఇచ్చారు. ఆ తర్వాత మిథాని భూమిపై మజ్లిస్ నేత అసదుద్దీన్ ఒవైసీ స్వయంగా ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఎన్ఓసీని పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. అదనంగా మరో 10 ఎకరాల ప్రభుత్వ భూమిని తమకు కేటాయించాలని అక్బరుద్దీన్ ఒవైసీ కూడా సీఎంకు మరో వినతిపత్రం సమర్పించారు.
అయితే ఆ తర్వాత చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్కు మజ్లిస్ దూరమైంది. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నది. ఇది జరిగిన పక్షం రోజుల వ్యవధిలోనే మిథాని భూమి ఎన్ఓసీ రద్దుపై ఉన్న స్టే ఉత్తర్వులను ప్రభుత్వం తొలగించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి బి. ఆర్. మీనా ఉత్తర్వులు ఇచ్చారు.
దీంతో ఆ భూమి తమదని వాదిస్తున్న మహ్మద్ షరీపుద్దీన్ మరికొందరు హైదరాబాద్ ఆర్డీవోకు అప్పీల్ చేశారు. దీన్ని విచారించిన తర్వాత 2.57 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని ఆర్డీవో తాజాగా ఉత్తర్వులిచ్చారు. వెంటనే ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని బండ్లగూడ తహసిల్దార్ను ఆదేశించారు.












Click it and Unblock the Notifications