తెలంగాణ గొంతు కట్: నల్లధనం కుబేరుల్లో వివేక్
పిటిఎల్, సిటిఎల్ సంస్థలలో జమ అయిన నల్లధనం కుబేరుల జాబితాలో భార తదేశానికి చెందిన 612 మంది భారతీయులు ఉన్నట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం ప్రచురించింది. వీరిలో మన రాష్ట్రానికి చెందిన ముగ్గురిలో తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపి వివేక్ పేరు ఉంది.
దాంతో వివేక్ తెలంగాణ దూకుడుకు కళ్లెం పడే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. అదే సమయంలో ఆయన ముఖ్యమంత్రిపై కూడా గతంలో మాదిరిగా విరుచుకు పడే అవకాశం లేదని అంటున్నారు. ఆయన రాజకీయంగా తీవ్రమైన వివాదంలో చిక్కుకునే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
ముఖ్యమంత్రి ఎన్.కిరణ్కుమార్రెడ్డే లక్ష్యంగా టి.కాంగ్రెస్ ఎంపీలను కూడగట్టి అసమ్మతికి ఆజ్యం పోయడంలో ఎంపీ జి.వివేక్ పాత్ర ప్రముఖంగా సాగిందని ముఖ్యమంత్రివర్గం భావిస్తోంది. పార్టీ అధిష్టానానికి పలుసార్లు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా లేఖలు రాయడమే కాకుండా మీడియా ముఖంగా వివేక్ బహిరంగ విమర్శలు చేశారు.
ఇప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రచురించిన నల్లధనం కుబేరుల జాబితాను అస్త్రంగా చేసుకొని వివేక్ దూకుడుకు కళ్లెం వేయాలని ముఖ్యమంత్రి వర్గం భావిస్తోంది. బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్లోని బెల్రోజ్ యూనివర్సల్ అనే కంపెనీలో ఎంపీ జి.వివేకానంద, ఆయన భార్య సరోజ భాగస్వాములుగా ఉన్నట్లు రికార్డులను ఊటంకిస్తూ ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక వార్తాకథనాన్ని ప్రచురించింది.
ఈ కథనంపై తెలంగాణ కాంగ్రెసు నేతలు స్పందించలేదు. అయితే అది ప్రత్యర్థులకు రాజకీయంగా దోహదపడుతుందని ఆందోళన చెందుతున్నారు. వివేక్ది తప్పు ఉంటే ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందేనని స్వయాన వివేక్ బావ, మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే పి.శంకర్రావు అన్నారు.