..రికార్డ్ కాదు: వైయస్ నిలబెట్టాడు మరి, బాబు
వైయస్ పాదయాత్ర రికార్డును తమ అధినేత బద్దలు కొట్టారని ఉప్పొంగారు. దీనిపై వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెసు పార్టీల నుండి విమర్శలు కూడా వచ్చాయి. చంద్రబాబు పాదయాత్ర చేస్తోంది.. రికార్డుల కోసమే లేక ప్రజల కోసమా అని వారు ప్రశ్నించారు. అయితే ఇలాంటి సందర్భాలలో టిడిపి తమ్ముళ్లలో ఉత్సాహం రావడం.. అదే స్థాయిలో విపక్షాలు విమర్శించడం సహజమే. అయితే ఇప్పుడు కావాల్సింది.. ఉప్పొంగాల్సింది రికార్డులకు కాదని... 2014లో అధికారం కోసం ప్రయత్నాలు చేయాలని బాబు తెలుగు తమ్ముళ్లకు సూచిస్తున్నారట.
తనలాగే ఏ నియోజగవర్గ నాయకులు ఆ నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై స్పందిస్తూ... నిత్యం ప్రజల్లో ఉండాలని సూచిస్తున్నారట. 2014లో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు అందరూ సమష్టిగా కృషి చేయాలని సూచిస్తున్నారట. 2003లో వైయస్ పాదయాత్ర చేసి కాంగ్రెసు పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చాడు. అంతకుముందు రెండుసార్లు కాంగ్రెసు పార్టీ ఆయన ఆధ్వర్యంలో చంద్రబాబు అధినేతగా ఉన్న టిడిపి చేతిలో చావుదెబ్బ తిన్నది.
2004లో వైయస్ పాదయాత్రతో కాంగ్రెసును గెలిపించాడు! ఆ తర్వాత ఆయన క్రమంగా తన వ్యక్తిగత ఇమేజ్ పెంచుకున్నాడు. వైయస్ మృతి తర్వాత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ నుండి బయటకు వచ్చి వైయస్సార్ కాంగ్రెసు పార్టీని స్థాపించాడు. తన తండ్రి వైయస్ వ్యక్తిగతంగా ప్రజల్లో ఎంత వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకున్నాడో తెలిసిన జగన్ సొంత కుంపటి పెట్టుకున్నాడు. అయితే వైయస్ స్థాయిలో బాబుకు వ్యక్తిగత ప్రతిష్ట లేదని కాదు.
కానీ పరిపాలనను, తమ ప్రాంత సమస్యలను.... ఇలా ఎన్నింటినో ప్రజలు బేరీజు వేసుకుంటారు. చంద్రబాబు తన హయాంలో ఎంతగా అభివృద్ధి చేసినా రైతులు, ఉద్యోగుల ఆగ్రహం కారణంగా 2004లో టిడిపి ఓడిపోయిందనే అభిప్రాయం ఉంది. అలాగే వైయస్ తెరచాటుగా ఎంతో అవినీతికి పాల్పడ్డారనేది టిడిపి ఆరోపణ. కానీ తమకు వైయస్ ఎన్నో మంచి పనులు చేశారనేది చాలామంది ప్రజల అభిప్రాయం.
వైయస్ పాలనను చూసి మెచ్చుకునే వారు ఇప్పుడు జగన్ వైపు మొగ్గు చూపిస్తున్నారు. టిడిపి చేతిలో రెండుసార్లు వైయస్ చావు దెబ్బ తిని మూడోసారి పాదయాత్రతో వైయస్ కాంగ్రెసును అధికారంలోకి తీసుకు వచ్చి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు బాబు కూడా రెండుసార్లు కాంగ్రెసు చేతిలో చావు దెబ్బ తిని మూడోసారి చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాడు. అలాంటి సమయంలో ఆయన పాదయాత్ర చేపడుతున్నారు.
వైయస్ పాదయత్రతో కాంగ్రెసును అధికారంలోకి తీసుకు వచ్చాడు. ఇప్పుడు చంద్రబాబు తన పాదయాత్రతో టిడిపిని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు కంకణం కట్టుకున్నాడు. వైయస్కు అప్పుడు, బాబుకు ఇప్పుడు పాదయాత్రలో ఎన్నో అడ్డంకులు, అవాంతరాలు, అనారోగ్యం తలెత్తింది. వైయస్ కానీ, బాబు కానీ పాదయాత్రను మాత్రం ఆపలేదు. బాబు పాదయాత్రతో టిడిపిలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. వైయస్ కాంగ్రెసును గెలిపించినట్లు బాబు టిడిపిని గెలిపిస్తారని తెలుగు తమ్ముళ్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.