దీదీ, జయలతో ఢీ: అమిత్షాతో మోడీ ఆపరేషన్
న్యూఢిల్లీ: ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి ఉత్తర ప్రదేశ్లో 80 స్థానాలకు గాను 73 స్థానాలు గెలుచుకోవడం వెనుక అమిత్ షా కృషి ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్లో అవకాశం దక్కుతుందని, వడోదర నుండి ఎంపీగా పోటీ చేస్తారని, యూపి సిఎం రేసులో ఉన్నారని, బిజెపి జాతీయ అధ్యక్షుడి రేసులో ఉన్నారని ఊహాగానాలు వినిపించాయి. అయితే, ఈ యూపి మాస్టర్ బ్రెయిన్ అమిత్ షాను 2019 ఎన్నికలు లక్ష్యంగా ఉపయోగించుకోనున్నారట.
ఇందుకోసం మోడీ పావులు కదుపుతున్నారట. త్వరలో అమిత్ షా పశ్చిమ బెంగాల్, తమిళనాడుల పైన దృష్టి సారించనున్నారట. ఇటీవలి ఎన్నికల్లో బిజెపి, మిత్ర పక్షాలు దేశవ్యాప్తంగా సత్తా చాటాయి. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఒడిశాలలో మాత్రం ప్రాంతీయ పార్టీల హవా కొనసాగింది. ఈ నేపథ్యంలో వాటి పైన వరుసగా బిజెపి దృష్టి సారిస్తోంది. అందులో భాగంగా అమిత్ షా తమిళం, బెంగాలీ నేర్చుకుంటున్నారు.
బిజెపిని దేశవ్యాప్తంగా పటిష్ఠం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మోడీకి అత్యంత సన్నిహితుడైన అమిత్ షాకు వ్యూహాత్మకంగానే మంత్రి పదవిని ఇవ్వలేదంటుననారు. యూపీలో 80 స్థానాలకు 73 స్థానాల్లో విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన అమిత్ షాకు మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఆ బాధ్యతలను అప్పగించాలని మోడీ యోచిస్తున్నారట.
అమిత్ షా
యూపీలోను, రాజస్థాన్, గుజరాత్లలోనూ ఈసారి సాధించిన ఘన విజయాలు వచ్చే ఎన్నికల్లో సాధించలేకపోవచ్చని అందుకని దక్షిణ, తూర్పు భారత దేశంలోనూ బిజెపిని విస్తరించాలని మోడీ ప్రణాళికలు రచిస్తున్నారని చెప్పాయి. దీనికోసం ఆయన ముఖ్యంగా 81 స్థానాలున్న పశ్చిమ బెంగాల్(42), తమిళనాడు(39)లను ఎంచుకున్నారు. ఈ రెండు రాష్ట్రాలకు అమిత్షాను ఇన్చార్జ్గా పంపాలని మోడీ నిర్ణయించుకున్నారు.
మమతా బెనర్జీ
బెంగాల్లో కమ్యూనిస్టులు నానాటికీ క్షీణిస్తుండడంతో తృణమూల్కు ప్రత్యామ్నాయంగా బిజెపిని సన్నద్ధం చేయడానికి రంగం సిద్ధమవుతోంది. బెంగాల్లో 40 ఎంపీస్థానాలున్నాయి. ఈ సారి ఎన్నికల్లో బిజెపి రెండు స్థానాలనే గెలుచుకున్నప్పటికీ ఓట్ల శాతాన్ని గతంలో కంటే గణనీయంగా పెంచుకుంది. గతంలో 5 శాతమున్న ఓటుబ్యాంకును ఈ సారి 17 శాతానికి పెంచుకుంది. వచ్చే ఎన్నికల నాటికి తృణమూల్ వ్యతిరేక ఓటు తమ పార్టీకి రావలన్న లక్ష్యంతో అమిత్ షా పని చేయనున్నారు.
జయలలిత
అదే విధంగా కాంగ్రెస్ జీరో అయిపోయిన తమిళనాడులోనూ కాషాయ జెండా రెపరెపలాడించడానికి కూడా అమిత్ షా సేవలు వినియోగించుకోవాలని మోడీ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమిత్ షా బెంగాల్, తమిళనాడుల్లోని పార్టీ కార్యకర్తలతో మాట్లాడేందుకు వీలుగా ఆ రెండు భాషలను నేర్చుకుంటున్నారట.
నరేంద్ర మోడీ
త్వరలోనే అమిత్ షా ఈ రెండు రాష్ట్రాల్లో తన మిషన్ మొదలు పెడతారట. ఇందుకోసం నరేంద్ర మోడీ పక్కా ప్రణాళికలతో సిద్దమయ్యారట.