కోట్లు కుమ్మరింపు: సచివాలయానికి మరో 530 కోట్లు
అమరావతి: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలోని వెలగపూడిలో ఏపీ ప్రభుత్వం చేపట్టిన తాత్కాలిక సచివాలయ నిర్మాణంలో ప్రజాధనం దుర్వినియోగం అవుతోందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాజధాని ప్రాంతంలోని వెలగపూడిలో ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఐదు బ్లాకులను నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే.
తొలుత తాత్కాలిక సచివాలయ నిర్మాణాన్ని రూ. 200 కోట్లతో నిర్మిస్తున్నామంటూ ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలిచిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తాత్కాలిక సచివాలయానికి మరో రూ. 530 కోట్లు మంజూరు చేసినట్లు మీడియాలో ఓ ఆసక్తికర కథనం వచ్చింది.
తాజాగా వెలగపూడిలో మరో గ్రౌండ్ ప్లస్ రెండు అంతస్తులు నిర్మించాలని ఏపీ ప్రభుత్వం తలపెట్టినట్లు ప్రకటించింది. అయితే ఇప్పుడు మరో రెండు అంతస్థుల నిర్మాణం చేయడానికి ఈ నిధులు కేటాయించినట్లు తెలుస్తోంది. ఇందుకు గాను సీఆర్డీఏ కమిషనర్ టెండర్లు పిలవనున్నారు.

అయితే శాసనసభ, శాసనమండలి ఉన్న బ్లాకుల్లో తప్పించి మిగతా మూడు బ్లాకుల్లో ఈ అదనపు అంతస్థులను నిర్మించనున్నారు. ఈ భవనాల్లోని వివిధ మౌలిక వసతుల కల్పనతో పాటు ఇంటీరియర్ కోసం ఇంత మొత్తం విడుదల చేసినట్లు సమాచారం. గతంలో ప్రకటించిన రూ. 200 కోట్లు కూడా తాజాగా విడుదల చేసిన రూ. 530 కోట్లలో భాగమైతే బాగుండేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అలా కాకుండా కేవలం గ్రౌండ్ ప్లస్ రెండు అంతస్తుల కోసం ఇలా విడతల వారీగా ఏపీ ప్రభుత్వం ఇలా కోట్ల రూపాయలను విడుదల చేస్తూ పోతుంటే తాత్కాలిక రాజధాని నిర్మాణం పూర్తయ్యే సరికే రూ. 1000 కోట్లు ఖర్చు అవుతుందని రాజకీయ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఏపీని అభివృద్ధి పథంలో నడిపిస్తానని గొప్పలు చెప్పుకుంటోన్న చంద్రబాబు ఇలా విడతల వారీగా వందల కోట్ల రూపాయలను తాత్కాలిక సచివాలయానికి ఖర్చు చేస్తుండటంపై మండిపడుతున్నారు. సోమవారం తెల్లవారు జామున తాత్కాలిక రాజధానిని లాంఛనంగా ప్రారంభించిన చంద్రబాబు అక్కడ సిద్ధం చేసిన రెండు గదుల్లోని ఓ గదిలో కూర్చుని రుణమాఫీకి సంబంధించిన ఫైలుపై సంతకం చేసిన సంగతి తెలిసిందే.
శాస్త్రం ప్రకారం రెండో రోజు కూడా అక్కడికి వెళ్లాలని చంద్రబాబుకు పండితులు సూచించారు. పండితుల సూచన మేరకు మంగళవారం కూడా వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయనానికి వెళ్లనున్న చంద్రబాబు నిన్న కూర్చున్న గదిలోనే కాసేపు కూర్చుని కొన్ని ఫైళ్లను పరిశీలించనున్నారు.












Click it and Unblock the Notifications