ఆర్థిక శాఖ నుంచి రాష్ట్రపతి వరకు.. సత్సంప్రదాయాలు నెలకొల్పిన నేతలు
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రిగా అరుణ్ జైట్లీ వచ్చేనెల ఒకటో తేదీన వరుసగా ఐదో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైంది. 2014లో కేంద్రంలో నరేంద్రమోదీ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత పలువురు మంత్రుల శాఖలు మారిన ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ శాఖ మాత్రం ఏమాత్రం మారలేదు. తద్వారా ఇంతకుముందు ఒకటి కంటే ఎక్కువగా బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రుల జాబితాలో జైట్లీ కూడా చేరారు.
అత్యధికంగా పది బడ్జెట్లను ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి మొరార్జీ దేశాయ్.రెండు పర్యాయాలు 1964, 1968ల్లో తన పుట్టినరోజైన ఫిబ్రవరి 29న బడ్జెట్లు ప్రవేశపెట్టారు. ఇటువంటి ప్రత్యేకత మరే ఆర్థికమంత్రికీ లేదు. ఆయన దేశ ప్రధానిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. మొరార్జీ దేశాయి ఆర్థికశాఖతోపాటు మరో కీలకమైన హోంశాఖ మంత్రిగా కూడా పని చేశారు.
సీడీ దేశ్ ముఖ్ సారథ్యంలో అతి తక్కువ పదాల బడ్జెట్
మొరార్జీ దేశాయి తర్వాత ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన డాక్టర్ మన్మోహన్ సింగ్ కూడా ఐదు బడ్జెట్లు ప్రవేశపెట్టారు. ఆర్థిక సంస్కరణలకు శ్రీకారంగా 1991లో మన్మోహన్సింగ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతుల పరంగా అతి పెద్దది. ఆ బడ్జెట్లో 18,520 పదాలు ఉన్నాయి. అతి తక్కువ పదాలతో కూర్చిన బడ్జెట్ 1952 నాటిది. కేవలం 4,454 పదాలతో బడ్జెట్ తయారు చేశారు అప్పటి ఆర్థిక మంత్రి సీడీ దేశ్ముఖ్. ఇప్పటివరకూ బడ్జెట్లు ప్రవేశపెట్టిన 25మంది ఆర్థిక మంత్రుల్లో 11మంది న్యాయ విద్యను అభ్యసించినవారు ఉన్నారు. 1999 - 2000 వరకు బడ్జెట్ను సాయంత్రం 5గంటలకు ప్రవేశపెట్టేవారు. 2001 నుంచి దాన్ని 11గంటలకు మార్చారు. ఇక అతి తక్కువ పదాలతో కూర్చిన బడ్జెట్ 1952 నాటిది. కేవలం 4,454 పదాలతో బడ్జెట్ తయారు చేశారు అప్పటి ఆర్థిక మంత్రి సీడీ దేశ్ముఖ్.
హోం ప్లస్ ఆర్థిక శాఖ నిర్వహించిన మంత్రుల్లో చిద్దూ రెండోవారు
కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి పళనియప్పన్ చిదంబరం అత్యధికంగా ఎనిమిది బడ్జెట్లను పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన మంత్రిగా రెండోస్థానంలో నిలిచారు. 2004లో యూపీఏ ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత ఆర్థికశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన చిదంబరం 2008 వరకు కొనసాగారు. 2008లో ముంబైపై లష్కరే ఉగ్రవాదుల దాడి జరగడంతో అప్పటి హోంశాఖ మంత్రి శివరాజ్ పాటిల్ వైదొలగాల్సి రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో చిదంబరం హోంశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2009 డిసెంబర్ తొమ్మిదో తేదీ రాత్రి.. అప్పటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ జన్మ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిందీ హోంమంత్రిగా చిదంబరమే కావడం గమనార్హం. తిరిగి 2009 - 12 వరకు ఆర్థికశాఖ మంత్రిగా ప్రస్తుత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పని చేశారు. తిరిగి చిదంబరం ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తర్వాతే 2012లో రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ ఎన్నికయ్యారు. అంతకుముందు యునైటెడ్ ఫ్రంట్ హయాంలో 1997 మే ఒకటో తేదీ నుంచి 1998 మార్చి 19 వరకు చిదంబరం ఆర్థిక శాఖ మంత్రిగా పని చేశారు.
ఆ ముగ్గురు నేతలు.. ఏడు బడ్జెట్లు
మాజీ ఆర్థిక మంత్రులుగా చిదంబరం తర్వాతీ స్థానం ప్రస్తుత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీదే. బెంగాలీ దాదా.. ప్రణబ్ ముఖర్జీ తన రాజకీయ జీవితంలో ఏడుసార్లు పార్లమెంట్కు బడ్జెట్ సమర్పించారు. అంతకుముందు ఇదే రికార్డును యశ్వంతరావు బల్వంతరావు చవాన్, సీడీ దేశ్ ముఖ్ నెలకొల్పారు. అంతకుముందు యశ్వంతరావు బల్వంతరావు చవాన్ 1981 - 84 మద్య ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్గా సేవలందించారు. 1990లో ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్గా నియమితులైన మధు దండావతే తర్వాత 1996లో ఆర్థిక మంత్రిగా పని చేశారు. 1991లో పీవీ హయాంలో ప్రణబ్ ముఖర్జీ ఐదేళ్లపాటు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా సేవలందించారు. అంతకుముందు 1982 - 1984 మధ్య తొలిసారి ఆర్థిక మంత్రిగా పని చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా 1985 - 87 మధ్య ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్గా ఉన్నారు.
ఆర్థికశాఖనూ నిర్వహించిన ప్రధానుల్లో ఇందిర, రాజీవ్, మన్మోహన్
ప్రధానులుగా ఉంటూ ఆర్థిక మంత్రిత్వశాఖను నిర్వహించిన దాఖలాలు ఉన్నాయి. ఇది తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ నుంచే మొదలైంది. 1958 ఫిబ్రవరి 13 నుంచి నెల రోజుల పాటు ఆర్థిక శాఖనూ నెహ్రూ నిర్వహించారు. తర్వాత ఆయన తనయ ఇందిరాగాంధీ 1970 - 71లో ప్రధానిగా బాధ్యతలు నిర్వహిస్తూనే ఆర్థిక మంత్రిగా పని చేశారు. 1979లో ఆర్థిక మంత్రిగా పని చేసిన చరణ్ సింగ్ తర్వాత ప్రధానిగా నియమితులయ్యారు.1987లో బోఫోర్స్ కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత విశ్వనాథ ప్రతాప్ సింగ్ వైదొలగడంతో 1987 జనవరి 24 నుంచి 1987 జూలై 25 వరకు నాటి ప్రధాని రాజీవ్ గాంధీ ఆర్థిక శాఖ నిర్వహించారు. 2008లో ముంబై దాడుల నేపథ్యంలో ఆర్థిక మంత్రి చిదంబరం వైదొలిగి హోంశాఖ చేపట్టడంతో 2008 నవంబర్ 30 నుంచి 2009 జనవరి 24 వరకు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆర్థికశాఖను నిర్వహించారు. తిరిగి 2012 జూన్ 26 నుంచి జూలై 31 వరకు అదే రెండోసారి ఆర్థికశాఖ బాధ్యతలను మన్మోహన్ సింగ్ అదనంగా నిర్వర్తించారు.