టిడిపి కన్నా మెరుగు: సిఎం సీటుపై బిజెపి కన్ను
సికింద్రాబాద్, మహబూబ్నగర్ లేదా నాగర్ కర్నూల్, కరీంనగర్ లేదా పెద్దపల్లి, వరంగల్, భువనగిరి లేదా మల్కాజిగిరి, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, చేవెళ్ల లోకసభ స్థానాలను బిజెపి అడగాలని నిర్ణయించుకుంది. ఇటీవల జరిగిన 8 జిల్లాల అధ్యక్షుల సమావేశాల్లోనూ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాలన్న డిమాండ్ వచ్చింది. తెలుగుదేశం పార్టీతో పొత్తు నేపథ్యంలోనే ఇలాంటి డిమాండ్ వచ్చినట్లు చెబుతున్నారు. బిజెపి డిమాండ్లకు తెలుగుదేశం పార్టీ అంగీకరిస్తుందా అనేది సందేహంగానే ఉంది.
శనివారం పార్టీ కార్యాలయంలో బిజెపి తెలంగాణ ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో 17 లోకసభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై చర్చ జరగనుంది. ఇప్పటికే ఈ స్థానాలకు ఆశావహుల జాబితా సిద్ధమైంది. కొన్ని స్థానాలకు ఇద్దరు, మరికొన్ని స్థానాలకు ముగ్గురు నలుగురు చొప్పున టికెట్టు ఆశిస్తున్నారు. ఎక్కువ మంది ఆశావహులు ఉన్న చోట ఇద్దరు అభ్యర్థుల చొప్పున ఎంపిక చేసి తుది జాబితా సిద్ధం చేయనున్నారు. ఈ జాబితాను జాతీయ ఎన్నికల కమిటీకి పంపుతారు. అయితే మహబూబ్నగర్ నుంచి నాగం జనార్ధన్రెడ్డి ఒక్కరే టికెట్ ఆశిస్తున్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు కొలిక్కి రాని పక్షంలో జాతీయ ఎన్నికల కమిటీ నిర్ణయించిన అభ్యర్థులు రంగంలోకి దిగనున్నారు.
ఎన్నికల ప్రణాళికపై బిజెపి తెలంగాణ కమిటీ కసరత్తు ప్రారంభించింది. ఏప్రిల్ 2న నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభానికి ముందే మేనిఫెస్టోను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు మేనిఫెస్టో తయారీపై శుక్రవారం పార్టీ కార్యాలయంలో మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది. పార్టీ సీనియర్ నేతలు శేషగిరిరావు, రాజేశ్వర్రావు, చింతా సాంబమూర్తి, మేచినేని కిషన్రావు, మల్లారెడ్డి, నరహరి వేణుగోపాల్రెడ్డి తదితర 25 మంది సభ్యులు సమావేశంలో పాల్గొని వివిధ అంశాలపై చర్చించారు. ముఖ్యంగా 22 అంశాలను మేనిఫెస్టోలో చేర్చాలని ప్రాథమికంగా నిర్ణయించారు.