చంద్రబాబు చాణక్యం: వారు విలవిల, కేంద్రానికి చిక్కులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అపర చాణక్యుడనే పేరుంది. తన వ్యూహాలతో ఎదుటివారిని దెబ్బ తీస్తారనే అభిప్రాయం కూడా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ సమస్యలపై ఆయన అనుసరిస్తున్న వ్యూహం కూడా అందుకే చర్చలోకి వస్తోంది.
పోలవరం, ఫాతిమా కాలేజీ విద్యార్థుల సమస్య, కాపు రిజర్వేషన్ల వంటి సమస్యలను ఆయన తెలివిగా కేంద్రం కోర్టులోకి విసిరేశారని అంటున్నారు. కేంద్రంపై బాధ్యతను మోపి వాటి వ్యతిరేక ప్రభావం తనపై పడకుండా చూసుకుంటున్నారనే అభిప్రాం ఉంది.

కేంద్రం లేఖ ఎదురు తిరిగిందా...
పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం రాసిన లేఖ వల్ల చంద్రబాబు చిక్కులో పడ్డారని అందరూ అనుకున్నారు. స్పిల్వే, స్పిల్ ఛానెల్ పనులకు పిలిచిన టెండర్లను నిలిపివేయాలని కేంద్రం లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే, ఈ విషయంలో చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించి కేంద్రాన్నే ఆత్మరక్షణలోకి నెట్టారనే అభిప్రాయం ఉంది.

చంద్రబాబు ఇలా అసెంబ్లీలో..
పోలవరం పనులను నిలిపేయాలని కేంద్రం రాసిన లేఖను చంద్రబాబు అసెంబ్లీలో ప్రస్తావించారు. గడువులోగా పూర్తిచేస్తామంటే పోలవరం ప్రాజెక్టును కేంద్రానికి అప్పగిస్తామని ఆయన చెప్పారు. లేఖల ద్వారా చిరాకు పెడతే పోలవరం ప్రాజెక్టు సకాలంలో పూర్తి కాదని ఆయన అన్నారు. ఆ లేఖల విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.

గడ్కరీ దేవినేని ఉమను పిలిచి..
చంద్రబాబు చేస్తున్న ప్రచారం తమకు ఎదురు తిరిగే ప్రమాదం ఉందని గ్రహించిన కేంద్ర మంత్రి గడ్కరీ ఆంధ్రప్రదేస్ జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమమహేశ్వర రావును ఢిల్లికీ పిలిపించుకుని మాట్లాడారు. తర్వాత చంద్రబాబు కూడా మాట్లాడారు. దాంతో కేంద్రం దిగి వచ్చిందని అంటున్నారు.

కాపు కోటాపై చంద్రబాబు ఇలా..
పోలవరంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే చంద్రబాబు కాపు రిజర్వేషన్ల అంశాన్ని ముందుకు తెచ్చారు. దాంతో చర్చ కాపు కోటాపైకి మళ్లింది. కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీ బిల్లు ఆమోదించడం, దాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని కోరడం చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు కాపు రిజర్వేషన్లను అమలు చేయాల్సిన బాధ్యత మోడీ ప్రభుత్వంపైనే పడింది. గవర్నర్ ఆమోదించిన తర్వాత బిల్లు కేంద్రానికి వెళ్తుంది.

ఫాతిమా కాలేజీ విద్యార్థుల సమస్య కూడా.
ఫాతిమా కళాశాల విద్యార్థుల సమస్యపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఆ సమస్యను పరిష్కరించాల్సింది కేంద్రమేనని చంద్రబాబు ప్రభుత్వం చెప్పేసింది. ఫాతిమా కాలేజీ విద్యార్థుల సమస్య పరిష్కారానికి మూడు ప్రత్యామ్నాయాలను సూచిస్తూ ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ కూడా రాసింది. దాంతో ఈ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత కూడా కేంద్రంపై పడింది.

చంద్రబాబు వ్యూహంతో బిజెపి విలవిల...
చంద్రబాబు వ్యూహంతో బిజెపి నేతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలవిలలాడుతున్నారు. కేంద్రం వైఖరి పూర్తిగా స్పష్టం కాక, తమ పార్టీ నేతలో కొంత మంది చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరించడం జీర్ణించుకోలేక పురంధేశ్వరి, కన్నా లక్ష్మినారాయణ, సోము వీర్రాజు వంటి నేతలు అసంతృప్తికి గురువుతున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications