నేరెళ్ల ఘటన: కెటిఆర్ ఇలా, కోర్టుకు అలా.. మరీ ఇంతగా..
హైదరాబాద్: నేరెళ్ల ఘటనను తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ప్రభుత్వం మాసి పూసి మారేడు కాయ చేయాలని అనుకుంటున్నట్లు అర్థమవుతోంది. ప్రభుత్వం ద్వంద్వ నీతిని అనుసరిస్తున్న తీరు స్పష్టంగా బయటపడింది.
ఓ వైపు సంఘటనకు కేవలం ఎస్సై రవీందర్ను డిఐజి రవివర్మ నివేదిక ఆధారంగా వరంగల్ ఐజి నాగిరెడ్డి గురువారంనాడు సస్పెండ్ చేశారు. దాంతో బహుశా, చేతులు దులిపేసుకుందామని ప్రభుత్వం అనుకుని ఉంటుండవచ్చు. కానీ మరో విధంగా కూడా ప్రభుత్వం దాన్ని మాయ చేయాలని చూస్తున్నట్లు అర్థమవుతోంది.
కేవలం ఐటి శాఖ మంత్రి, కెసిఆర్ తనయుడు కెటి రామారావు ప్రాతినిధ్యం వహిస్తున్న నేరెళ్లలో ఘటన జరగడం వల్లనే కాకుండా పోలీసులు వ్యవహరించిన తీరు వల్ల ప్రాధాన్యం చేకూరింది. పోలీసులు ప్రదర్శించిన క్రూరత్వంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.
కోర్టులో ఇలా....
చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న విధంగా కెటి రామారావు నేరెళ్ల బాధితులను పరామర్శించి, న్యాయం చేస్తానని హామీ ఇచ్చి వచ్చారు. ఆ మర్నాడే, బుధవారంనాడు హైకోర్టులో ప్రభుత్వం గమ్మత్తయిన వాదన చేసింది. నేరెళ్ల బాధితులకు అయిన గాయాలు ఇప్పటివి కావని, పాతవని కోర్టుకు తెలిపింది. పౌరహక్కుల సంఘం నేత గడ్డం లక్ష్మణ్ వేసిన లంచ్ మోషన్ పిటిషన్పై విచారణ సందర్భంగా ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్ డి. ప్రకాశ్ రెడ్డి అలా చెప్పారు.
పిటిషనర్ వాదన ఇది....
పిటిషనర్ తరఫున న్యాయవాది వి. రఘునాథ్ చెప్పిన వివరాల ప్రకారం - నేరెళ్ల, జిల్లెల, రామచంద్రపురం గ్రామాలకు చెందిన ఎనిమిది మంది యువకులను సిరిసిల్ల జిల్లా ఎస్పీ, స్థానిక ఎస్సై పర్యవేక్షణలో పోలీసులు కిరాతకంగా కొట్టారు. తంగళ్లపల్లి వాగు నుంచి ఇసుక తరలిస్తున్న 200 ఇసుక లారీలు క్రమం తప్పకుండా తిరుగుతూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న వైనాన్ని వ్యతిరేకించినందుకు యువకులను చిత్ర హింసలు పెట్టారు.
జైలర్ అంగీకరించకపోవడం వల్లనే....
తీవ్ర చిత్రహింసలకు గురైన యువకులను పోలసులు జైలుకు పంపించారని, వారి పరిస్థితి చూసి జైలర్ వారిని జైలులో పెట్టుకునేందుకు నిరాకరించారని అంటున్నారు. దానివల్లనే బాధితులను ఆస్పత్రిలో చేర్పించాల్సి వచ్చింది. వారు వేములవాడలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జైలులో పెట్టుకునేందుకు అధికారులు అంగీకరించి ఉంటే కథ మరోలా ఉండేదేమో తెలియదు.
ఇసుక మాఫియా అంటే కోపం...
నేరెళ్ల ఘటనపై జాతీయ స్థాయిలో చర్చ ప్రారంభమైన తర్వాత, సర్వత్రా నిరసన వ్యక్తమైన తర్వాత కెటిఆర్ కళ్లు తెరిచారు. బాధితులను పరామర్శించారు. న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. కోర్టులో ప్రభుత్వం వినిపించిన వాదన చూస్తుంటే కెటిఆర్ ఇచ్చిన హామీని ఎలా అర్థం చేసుకోవాలి. ఇసుక లారీల ఘాతుకానికి ఇప్పటి వరకు ఆరుగురు మృత్యువాత పడినట్లు తెలుస్తోంది.