తమిళ సంక్షోభం: చెన్నమనేని ముంగిట చతుర్మార్గాలు
చెన్నై: తమిళనాట అధికార అన్నాడీఎంకే అధికారం కోసం నిట్ట నిలువునా చీలే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళా నటరాజన్, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం పరస్పరం తలపడుతున్నారు. తమకే మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని ప్రకటనలు చేస్తున్నారు.
గమ్మత్తేమిటంటే శశికళ ఎమ్మెల్యేలందరినీ ఒక రహస్య స్థావరానికి తరలిస్తే.. పన్నీర్ సెల్వం మాత్రం తానెవరినీ సంప్రదించబోనని వారే పరిస్థితిని అర్థం చేసుకుని తనకు మద్దతునిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అన్నాడీఎంకే శాసనసభా పక్ష నేతగా శశికళ ఎన్నికైన తర్వాత సీఎంగా పన్నీర్ సెల్వం రాజీనామాను ఆమోదించిన గవర్నర్ చెన్నమనేని.. తదుపరి సీఎంగా చిన్నమ్మతో ప్రమాణ స్వీకారానికి చెన్నైకి రావాల్సింది. కానీ మహారాష్ట్రకు కూడా గవర్నర్ అయిన చెన్నమనేని ప్రస్తుతం ఢిల్లీ, ముంబై మధ్య ప్రయాణిస్తున్నారు. ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతికి ఫిర్యాదు చేలని శశికళ గ్రూప్ నిర్ణయించుకున్నట్లు తేలడంతో గవర్నర్ చెన్నైకి వస్తారని సమాచారం.
ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి సమాచారం లేకున్నా తమిళనాడు ప్లస్ మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు గురువారం మధ్యాహ్నం చెన్నైకి రానున్నారని సమాచారం. ఆయన అధికార కూటమిలో ముఖ్యమంత్రి పీఠం కోసం నెలకొన్న అంతర్గత పోరు నేపథ్యంలో తీసుకునే చర్యలేమిటనే అంశమే సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన తనకు గల విచక్షణాధికారాలను పరిగణనలోకి తీసుకుని నాలుగు రకాల అవకాశాల్లో ఏదో ఒక అంశానికి ప్రాధాన్యం ఇవ్వవచ్చునని భావిస్తున్నారు.

మెజారిటీ నిరూపణకు శశికళకే..
తమిళనాడు అసెంబ్లీలో అన్నాడీఎంకేకు 134 స్థానాలున్నాయి. వాటిలో జయ మృతితో ఒక సీటు ఖాళీగా ఉంది. వీరిలో మెజారిటీ ఎమ్మెల్యేలు తనకు మద్దతునిస్తున్నారని పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళా నటరాజన్ మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెను కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ చెన్నమనేని ఆదేశించడంతోపాటు నిర్దిష్ట సమయంలో అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కొనాలని సూచించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి

ప్రస్తుత పరిస్థితినే కొనసాగించదడం
రాష్ట్ర రాజకీయ పరిస్థితుల్లో స్పష్టత వచ్చే వరకూ ప్రస్తుత ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వంనే కొనసాగాలని ఆదేశించే అవకాశముంది. అక్రమాస్తుల కేసులో శశికళపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడేంత వరకూ వేచి చూస్తారు. ఈ కేసులో నిర్దోషిగా తేలితే సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టేందుకు ఆమెకు మార్గం సుగమం అవుతుంది. ఒకవేళ దోషిగా తేలితే మాత్రం రాజ్యాంగపరమైన పదవులు చేపట్టే అవకాశం ఉండడక పోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు పన్నీర్సెల్వాన్ని అంగీకరించని పక్షంలో కొత్త శాసనసభాపక్ష నేతను ఎన్నుకోవాల్సి ఉంటుంది.

రాష్ట్రపతి పాలనపై చెప్పలేం..
ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో కొంతకాలం తమిళనాట రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్రపతికి గవర్నర్ సిఫారసు చేసే అవకాశముంది. అయితే అసెంబ్లీని సుప్త చేతనావస్థలో ఉంచి, పరిస్థితిలో స్పష్టత వచ్చిన తర్వాత.. అధికార అన్నాడీఎంకేలో నెలకొన్న గందరగోళాన్ని చక్కదిద్దుకుంటే తిరిగి రాష్ట్రపతి పాలన ఎత్తేసి కొత్త ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి ఆస్కారం ఉంటుంది. లేకపోతే తిరిగి ప్రజా తీర్పు కోరేందుకు అవకాశముంది. ప్రస్తుత అసెంబ్లీకి ఇంకా నాలుగు సంవత్సరాల గడువు ఉన్నందున అన్నాడీఎంకే ఎమ్మెల్యేలెవరూ తాజా ఎన్నికలకు సిద్ధంగా లేనందున గవర్నర్ రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు మధ్యస్తంగా ఉన్నాయి.

పన్నీర్ సెల్వంకు అవకాశం
ఆపద్ధర్మ సీఎంగా పన్నీర్ సెల్వంను కొనసాగాలని గవర్నర్ చెన్నమేనని విద్యాసాగర్ రావు ఆదేశించేందుకూ అవకాశాలు లేకపోలేదు. రాజ్యాంగ పరంగా గవర్నర్ కు ఈ విషయమై విచక్షణాధికారాలు ఉన్నాయి. కానీ పన్నీర్ సెల్వం రాజీనామాను ఆమోదించారా? లేదా? ప్రకటించాల్సి ఉంటుంది. ఆమోదించకపోతే పన్నీర్సెల్వాన్ని ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ప్రస్తుత గందరగోళ పరిస్థితుల రీత్యా సభలో మెజారిటీ నిరూపించుకోవాలని గవర్నర్ ఆదేశించడానికి అవకాశమున్నది. పన్నీర్ సెల్వం కూడా తనకు చాలా మంది మద్దతు ఉన్నదని, కొన్నిరోజులు ఆగితే మరింత మంది తన పక్షాన చేరుతారని గవర్నర్ తో చెప్పే అవకాశాలే పుష్కలంగా ఉన్నాయి. కానీ ప్రస్తుతం పార్టీని చీల్చేందుకు 133 మంది పార్టీ శాసనసభ్యుల్లో కనీసం 90 మంది ఆయనకు కావాలి. అయితే అసలు గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు వీరిద్దరితో సమావేశమవుతారా? రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి, రాజకీయ నేపథ్యం తదితర అంశాలపై అధికారులతో సమీక్షకే పరిమితం అవుతారా? అన్నది కూడా వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications