భావ్నగర్ వెస్ట్ కీలకం: ఇద్దరూ పార్టీల శాఖల అధ్యక్షులే.. ఎవరికి పటేళ్ల మద్దతు?
ఇటు బీజేపీ గుజరాత్ శాఖ అధ్యక్షుడు జీతువాఘానీ.. అటు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శక్తిసింగ్ గోహిల్ తలపడుతున్నారు.
న్యూఢిల్లీ: గతంలో బీజేపీ గుజరాత్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జితూ వాఘానీకి పుష్కలంగా పాటిదార్ల మద్దతు పొందేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితి తిరగబడింది. ప్రస్తుతం పాటిదార్లకు రిజర్వేషన్ అమలు చేయాలని కోరుతూ పాటిదార్ల నాయకుడు హార్దిక్ పటేల్ ఆందోళన చేపట్టడంతో ఆ సామాజిక వర్గం మద్దతు లభించడం కష్ట సాధ్యంగా మారింది. గుజరాత్లో 182 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భావ్ నగర్ వెస్ట్ స్థానం కూడా కీలకమైన స్థానాల్లో ఒకటిగా ఉన్నది. దానికి కారణం ఈ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ గుజరాత్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జితూ వాఘానీ పోటీ చేయడమే కారణం.
మరోవైపు ఆయన ప్రత్యర్థిగా గుజరాత్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శక్తిసింగ్ గోహిల్ బరిలో నిలవడం మరో కారణం. జితూ వాఘానీ తన సొంత నియోజకవర్గం భావ్ నగర్లో విజయం సాధించగలనని కడు విశ్వాసంతో ఉన్నారు. కానీ శక్తిసింగ్ గోహిల్కు పటేళ్ల నాయకుడు హార్దిక్ పటేల్ ఇతోధిక మద్దతు ఉన్నదని, కనుక జితూ వాఘానీ విజయావకాశాలను ఇది దెబ్బ తీస్తుందని భావిస్తున్నారు.

భావ్ నగర్ లో చురుగ్గా కాంగ్రెస్ కార్యకలాపాలు
బీజేపీ గుజరాత్ రాష్ట్ర అధ్యక్షుడిగా జితూ వాఘానీ కూడా ఒక పటేల్ నాయకుడే. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర బీజేపీ నాయకత్వం ముందు పెట్టిన 150 అసెంబ్లీ స్థానాల విజయ లక్ష్యం ‘మిషన్ 150' సాధనలో జితూ వాఘానీ కీలకం కానున్నది. కానీ భావ్ నగర్ వెస్ట్ అసెంబ్లీ స్థానం సిట్టింగ్ ఎమ్మెల్యేగా జితూ వాఘానీ మళ్లీ.. అందునా జీపీసీసీ అధ్యక్షుడు శక్తిసింగ్ గోహిల్తో తల పడి గెలుపొందడం అంత తేలికేం కాదు. భావ్ నగర్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ చాలా చురుగ్గా వ్యవహరిస్తోంది. ‘పాస్' కన్వీనర్ హార్దిక్ పటేల్ ఆందోళనకు తోడు స్థానికుల మద్దతు కూడా ఇతోధికంగా లభిస్తోంది. ఇదే అంశం బీజేపీని కలవర పరుస్తోంది. ఈ క్రమంలో ఎన్నికల సమరంలో ప్రతి ఒక్క అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని కమలనాథులు పావులు కదుపుతున్నారు.

అటు హార్దిక్ పటేల్ రోడ్ షో
భావ్ నగర్లో కాంగ్రెస్ పార్టీ నేత శక్తి సింగ్ గోహిల్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జితూ వాఘానీ ‘స్నేహ్ మిలాన్' నిర్వహించిన నాడే హార్దిక్ పటేల్ రోడ్ షో నిర్వహించారు. పాటిదార్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకుల్లో జితూ వాఘానీ మాత్రమే కాక పాటిదార్ నేతలు కూడా గడ్డుకాలం ఎదుర్కొంటున్నారు. గతంలో సర్పంచ్గా పని చేసిన జితూ వాఘానీ పట్ల క్షత్రియులు, రాజపుత్రులు వ్యతిరేకత కొని తెచ్చుకున్నారు. గతంలో కచ్ జిల్లా అబ్దాసా నుంచి ఎమ్మెల్యేగా ఉన్న శక్తి సింగ్ గోహిల్.. భావ్ నగర్ నియోజకవర్గంలో వాఘానీకి వ్యతిరేకత ఉన్నదన్న సంగతి తెలుసుకుని, ఆయనపై పోటీ చేయాలని సంకల్పించారు. వాఘానీకి మద్దతుగా ఉన్న పునాదిని తప్పించడంతోపాటు గోహిల్ పాటిదార్ల హక్కుల పరిరక్షణకు క్రుషి చేస్తూనే క్షత్రియులు, రాజపుత్రులను అక్కున చేర్చుకోవడంలో నిమగ్నమయ్యారు. ఇతరుల ప్రయోజనాలపై ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

కాంగ్రెస్ పార్టీవి కుల రాజకీయాలన్న జీతూ వాఘానీ
జీతూ వాఘానీ తన ఎన్నికల ప్రచారంలో పూర్తిగా బీజేపీ అభివ్రుద్ధి ఎజెండాపైనే ద్రుష్టి సారించారు. ఓబీసీ కోటాలో పటేళ్లకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు శ్రీకారం చుట్టిన హార్దిక్ పటేల్ ‘కాంగ్రెస్ పార్టీ ఏజంట్' అన్న ముద్ర వేశారు. కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల్లో గెలుపొందేందుకు వివిధ సామాజిక వర్గాలను విభజిస్తోందని చెప్పారు. కుల రాజకీయాలు చేస్తున్నదని మండి పడ్డారు. 2007 ముందు వరకు భావ్ నగర్ సౌత్ గా ఉన్న స్థానం తర్వాత భావ్ నగర్ వెస్ట్గా మారింది. 2007 అసెంబ్లీ ఎన్నికల్లో భావ్ నగర్ స్థానం నుంచి జితూ వాఘానీ సుమారు ఏడు వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 2012లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీని ఓడించి వాఘానీ విజయం సాధించారు. అబ్దాసా స్థానం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి గోహిల్ విజయం సాధించారు. రాజకీయ పరిణామాల్లో మార్పులతో జితూ వాఘానీ, శక్తి సింగ్ గోహిల్ పరస్పరం తలపడుతున్నారు.

పటేళ్లు 36 వేల మంది కీలకం
భావ్ నగర్ వెస్ట్ స్థానం పూర్తిగా కులాల ప్రాతిపదికన ఆధారపడి విజయావకాశాలు అందిస్తోంది. ఈ నియోజకవర్గంలో 2,41, 282 ఓట్లు ఉన్నాయి. వాటిలో పురుష ఓట్లు 1,25, 688 మంది కాగా, మహిళలు 1,15, 594 మంది. వీరిలో 54,300 మంది ఓటర్లు కోలి సామాజిక వర్గానికి చెందిన వారు. 36 వేల మంది పటేళ్లు, 23 వేల మంది క్షత్రియులు, 12 వేల మంది వానియా సామాజిక వర్గ ఓటర్లు ఉన్నారు. వీరితోపాటు 14 వేల మంది దళితులు, 22 వేల మంది మైనారిటీలు ఓటర్లు కాగా, 50,200 మంది ఓటర్లు ఓబీసీ సామాజిక వర్గాలకు చెందిన వారు ఉన్నారు. కానీ గత 22 ఏళ్లుగా ముస్లిం మైనారిటీలు ఓట్లేసిన దాఖలాలు లేవని అభిప్రాయాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications