నువ్వు హిందువైతే, ఎలా ప్రమోట్ చేస్తున్నావు: సిద్ధరామయ్యకు యోగి చురకలు
బెంగళూరు: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఇరువురు ఒకరి పైన మరొకరు చురకలు వేసుకుంటున్నారు.
యూపీలో ఆకలి చావులు ఎక్కువగా ఉన్నాయని, కర్నాటకలోని రేషన్ దుకాణాలను, ఇందిరా క్యాంటీన్లను సందర్శించి ఆదర్శంగా తీసుకోవాలని సిద్ధరామయ్య... యోగికి సూచించారు. దీనికి వెంటనే యోగి స్పందించారు. మీ ఆహ్వానానికి కృతజ్ఞతలు, మీ హయాంలోనే కర్నాటకలో రైతుల మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని విన్నానని, అంతేకాదు నిజాయితీపరులైన అధికారుల బదలీలు, వారి మరణాలకు కూడా మీ ప్రభుత్వమే కారణమంట కదా అని కౌంటర్ ఇచ్చారు.
గుజరాత్ ఫార్ములా విజయవంతం కావడంతో కర్నాటక ఎన్నికల నేపథ్యంలో అదే ఫార్ములాను అనుసరించాలని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలోనే యూపీ సీఎం ఆదిత్యనాథ్ను రంగంలోకి దించింది. కొద్ది రోజుల క్రితం జరిగిన టిప్పు జయంతి వేడుకల్లో బీఫ్ వడ్డించడం, ఆ కార్యక్రమానికి సిద్ధరామయ్యే హాజరు కావడంపై యోగి విమర్శలు గుప్పించారు.

హనుమంతుడి గడ్డపై ఇదేం అంటూ అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు ముందు మీ రాష్ట్రం గురించి చూసుకోవాలంటూ యోగికి సిద్ధరామయ్య కౌంటర్ ఇచ్చారు. అమిత్ షా మంత్రాంగం ఇక్కడ పని చేయదని, ఈసారి కూడా కాంగ్రెస్ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
తాజాగా, బెంగళూరు విజయనగర్లో జరిగిన బీజేపీ నవ కర్నాటక నిర్మాణ పరివర్తన యాత్రలో యోగి పాల్గొన్నారు. ఆయన సిద్ధరామయ్యకు మరోసారి చురకలు అంటించారు. హిందుత్వం జీవన విధానం అని, హిందుత్వం ఉన్నత విలువలకు నెలవైనదని, బీఫ్ తినవద్దని సూచిస్తుందని, మరి సిద్ధరామయ్య హిందువు అయితే బీఫ్ తినడాన్ని ఎలా ప్రమోట్ చేస్తున్నారని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications