ఢిల్లీని ఊడ్చేసిన బిజెపి: ఇవీ కేజ్రీ ఆప్ ఓటమికి కారణాలు
ఆమ్ ఆద్మీ పార్టీకి ఎదురైన విషమ పరీక్షలో విఫలమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆప్ గానీ, అరవింద్ కేజ్రీవాల్ గానీ ఎక్కడ తప్పిదాలకు పాల్పడిందన్న అనుమాన మేఘాలు బయటపడ్తున్నారు.
న్యూఢిల్లీ: ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఒక మిషన్తో రాజకీయాల్లో ప్రవేశించారు. కానీ ప్రజలతో సంబంధాలు కోల్పోతున్నారని మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ)కి జరిగిన ఎన్నికలు సంకేతాలిస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి ఎదురైన విషమ పరీక్షలో విఫలమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఆప్ గానీ, అరవింద్ కేజ్రీవాల్ గానీ ఎక్కడ తప్పిదాలకు పాల్పడిందన్న అనుమాన మేఘాలు బయటపడ్తున్నారు. కేవలం రెండేళ్ల క్రితం 2015లో ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను తుడిచిపెట్టేసి, మూడు స్థానాలు మినహా అన్ని స్థానాల్లోనూ గెలిచిన చరిత్ర ఆఫ్ది. ఎంసీడీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కాక ముందు కూడా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ ఒకవేళ బీజేపీ గెలుపొందితే మరో ఉద్యమం చేపడతానని హెచ్చరికలు జారీచేశారు.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమికి ఈవీఎంలలో టాంపరింగ్ జరిగిందన్న ఆరోపణలు గుప్పిస్తూ వచ్చారు. ఆయన పార్టీ నేతలు కూడా ఈవీఎంలతో బీజేపీ తనకు అనుకూలంగా రిగ్గింగ్ చేసుకున్నదని పదేపదే ఆరోపిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఎంసీడీ ఎన్నికల్లో కేజ్రీవాల్ అనుసరించిన వ్యూహంలో పొరపాట్లు ఒకసారి చూద్దాం..
ఢిల్లీ మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించటం.. అధికారంలోని ఆప్ దారుణంగా ఓడిపోవటం కొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేపింది. కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ఎదగాలని భావిస్తూ వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ.. తన జోరు గాలిబుడగేనని నిరూపించగా.. మోదీ ప్రభంజనం వల్లే బీజేపీ ఘన విజయం సాధించిందని విశ్లేషకులంటున్నారు. ఈ ఓటమితో ఆప్ ఒక రాజకీయ పార్టీగా తన అస్తిత్వాన్ని కాపాడుకునే అవకాశాలను జారవిడుచుకుంటోందని అభిప్రాయపడుతున్నారు.
కానీ మోదీ హవాలో బీజేపీ మరిన్ని ఓట్లు సంపాదించి చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. ఎన్నికల్లో గెలుపోటములు సహజమే. కానీ ఈ ఓటమి ఆప్కు చాలా నష్టం చేస్తుంది' అని సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ డైరెక్టర్ సంజయ్ కుమార్ తెలిపారు. గత ఎన్నికల్లో ఆప్ విజయం గాలిబుడగేనని తేలిందని ఢిల్లీ వర్సిటీ రాజకీయ పరిశోధక విద్యార్థి కుమార్ రాజేశ్ తెలిపారు.
ప్రజా సమస్యలు విస్మరించి వ్యక్తుల మధ్య పోరుగా చిత్రీకరించడమా?
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎంసీడీ ఎన్నికల పోరాటంలో నగర ప్రజల సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వడానికి బదులు వ్యక్తుల మద్య పోరుగా భావించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వ్యతిరేకంగా రణన్నినాదం చేశారు. కానీ రోజురోజుకు పెరిగిపోతున్న మోదీ చరిస్మా.. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయన సమర్థ నేతగా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్న సంగతి కేజ్రీవాల్ విస్మరించారు.
మోదీ హవాపై వ్యూహం మార్చుకోకుండా పాత పద్ధతిలోనే ముందుకెళ్లటం, ఢిల్లీలో తాము చేసిన పనిని ప్రజల్లోకి తీసుకెళ్లేబదులు.. ఇతర రాష్ట్రాల్లో పార్టీ విస్తరణకు ఆప్ నాయకత్వం పెద్ద పీట వేయటమూ ఆప్ ఓటమికి కారణంగా భావిస్తున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ నియామకం మొదలు పలు అంశాలపై కేంద్రం తీరును విమర్శించడం, సీఎం అధికారాలను లాగేసుకుంటున్నారన్న వాదనలు చేశారు. కానీ డెంగ్యూ, చికున్ గున్యా వంటి ప్రాణాంతక వ్యాధులు ఢిల్లీ వాసులను బాధ పెట్టినప్పుడు వారికి అవసరమైన చికిత్స అందేలా చూడడానికి బదులు కేంద్ర ప్రభుత్వాన్నే నిందిస్తూ కూర్చుకున్నారు.
శ్రేణుల బలం లేకున్నా ఇతర ప్రాంతాలపై చూపు
పంజాబ్, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి.. పార్టీని విస్తరించాలన్న అరవింద్ కేజ్రీవాల్ వ్యూహం భారీ తప్పిదం. పార్టీకి బలమైన పునాది లేకుండానే విజయాలపై ఆశలు పెట్టుకోవడం మొదటికే మోసం తెచ్చి పెట్టింది. దీనికి తోడు ఢిల్లీ సీఎంగా నగర ప్రజల సమస్యల పరిష్కారానికి బదులు జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాలని ఉవ్విళ్లూరారు. గత ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గోవా, పంజాబ్ ప్రజలు తిరస్కరించడం ఆప్కు, కేజ్రీవాల్కు కోలుకోలేని దెబ్బ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రతికూల ఫలితాలనిచ్చిన ప్రతిష్ఠంభన
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేసిన నజీబ్ జంగ్తో సీఎం కేజ్రీవాల్ అనునిత్యం ఘర్షణ పడటాన్ని ఢిల్లీ వాసులు హర్షించలేకపోయారు. తాను బాధితుడ్ని అయ్యాననే వాదన పదేపదే తేవడం ప్రజల్లో విసుగును, ఆగ్రహాన్ని రేకెత్తించింది. సీఎంవో అమలు చేసే ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను ఆమోదించబోనని లెఫ్టినెంట్ గవర్నర్గా నజీబ్ జంగ్ తేల్చేయడంతో అసలు గొడవ మొదలైంది. ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్దే తుది నిర్ణయం. దీనికి ప్రతిగా లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలను పట్టించుకోనవసరం లేదని పదేపదే అధికారులను ఆదేశిస్తూ వచ్చారు కేజ్రీవాల్. ఢిల్లీ సంయుక్త పోలీస్ కమిషనర్గా ఎంకే మీనా నియామకం పట్ల అభ్యంతరం తెలిపారు. ఐఎఎస్ అధికారి అల్కా దివాన్ నియామకం, ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్గా స్వాతిమాలివాల్ తదితర నియామకాలపై కేజ్రీ, లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య ప్రతిష్ఠంభన కొనసాగింది. ఇక సీఎంఓకు చెందిన 400 ఫైళ్లపై నజీబ్ జంగ్ విచారణకు ఆదేశించడం చట్ట విరుద్దమని కేజ్రీవాల్ ఆరోపణలకు దిగారు.
విశ్వసనీయత సంక్షోభంలో శాసనసభ్యులు
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యేలు ప్రజలతో సంబంధాలు కోల్పోయారు. ఇది ఎల్లవేళలా అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆప్ ను వెంటాడుతూనే ఉన్నది. పలువురు మంత్రులు వివాదాల్లో చిక్కకున్నారు. ఢిల్లీ ఆరోగ్యశాఖ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ నుంచి ఎమ్మెల్యే సందీప్ కుమార్ వరకు పలువురు పార్టీ నేతలు, మంత్రులు వివాదాల్లో చిక్కుకోవడం ప్రజల్లో వ్యతిరేకత పెరుగుదలకు కారణమైందన్న విమర్శ ఉన్నది. అమానుల్లాఖాన్, సోమనాథ్ భారతి, అల్కా లాంబా, జితేందర్ సింగ్ తోమర్ తదితర ఎమ్మెల్యేలపై పలు కేసులు నమోదు కావడం ఇబ్బందికరంగా మారింది. కుమార్ విశ్వాస్ వంటి కీలక నేత ఆప్ నాయకత్వంతో విశ్వాసం కోల్పోవడం.. సత్యేంద్ర జైన్ ఒక హవాలా కేసులో చిక్కుకోవడం.. భార్యను వేధించిన కేసులో సోమ్నాథ్ భారతి వంటి వారు ఆప్ భవితవ్యాన్ని దెబ్బతీశారన్న విమర్శలు ప్రస్ఫుటంగా వినిపిస్తున్నాయి.
ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యం
పరిశుభ్రత, పారిశుద్ధ్యం అనే రెండు అంశాలు 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘన విజయానికి కారణాలు. ఆమ్ ఆద్మీ పార్టీ భారీ వాగ్ధానాలే చేసింది. ఫలితంగా 70 అసెంబ్లీ స్థానాలకు 67 స్థానాల్లో విజయం సాధించింది. ఎన్నికల్లో విజయం సాధించగానే ఢిల్లీ వాసులకు ఉచిత నీరు, రాయితీపై విద్యుత్ సరఫరా చేస్తానని ప్రకటించారు. కానీ ప్రజల నిజమైన ఆందోళనను పట్టించుకున్న దాఖలాలు లేవు. రెండు లక్షలకు పైగా టాయిలెట్లు నిర్మిస్తామన్న హామీని నిలుపుకోలేకపోయారు. రోజూ నగరంలో బయటపడే చెత్త వ్యర్థాలతో ఎలా వ్యవహరించాలన్న వ్యూహం రూపొందించుకోవడంలో విఫలమయ్యారు. శానిటేషన్ వర్కర్ల ముఖాలకు మాస్కులు ఇస్తామని, వారికి ఆడపిల్లలు ఉంటే రూ.50 వేల ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తామని ఇచ్చిన హామీ, 30 - 40 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ హామీలు ఆప్ను గెలిపించలేకపోయాయి.
బీజేపీ ప్రచారం ఇలా
పదేళ్లుగా అధికారంలో ఉన్న మూడు ఢిల్లీ మునిసిపాలిటీల్లో బీజేపీ పాగా వేయటం అంత సులభంగా జరిగిందేం కాదు. ప్రజా వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకునేందుకు నరేంద్ర మోదీ గుజరాత్ సీఎంగా వాడిన ఫార్ములానే ఢిల్లీలోనూ బీజేపీ అమలుచేసింది. ఢిల్లీలోని మూడు మునిసిపాలిటీల్లో బీజేపీ సిట్టింగ్ కౌన్సిలర్లను పక్కనపెట్టి అన్నిచోట్లా కొత్తవారిని రంగంలోకి దించి ఘనవిజయం సాధించింది. ఈ ఎన్నికలను బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. కేంద్ర మంత్రులు రాజ్నాథ్, వెంకయ్య, ఉమాభారతి, స్మృతి ఇరానీ వంటి స్టార్ ప్రచారకర్తలను ఢిల్లీ ప్రచారంలో మోహరించింది.
ఒడిశాలో జరిగిన కీలకమైన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు సైతం వీరిని దూరంపెట్టి ప్రచారం చేయించారు. పార్టీ చీఫ్ అమిత్షా కూడా ఈ ఎన్నికలపై రోజువారీ సమీక్షలు నిర్వహించారు. ఢిల్లీ కాంగ్రెస్ కీలకనేతలైన లవ్లీసింగ్, బర్ఖా శుక్లా సింగ్ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరటం కూడా పార్టీకి కలిసొచ్చింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ ఇచ్చిన హామీల వైఫల్యాన్ని బీజేపీ పదేపదే ప్రస్తావించింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని పదే పదే చెప్పటం ద్వారా ఢిల్లీలో నివాసముండే పూర్వాంచల్ ప్రజల ఓట్లనూ రాబట్టుకున్నది. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అయోధ్యకు వెళతానన్న ఉమాభారతిని నిలువరించారు అమిత్ షా.