గుజరాత్ ఎన్నికల్లో వివాదాలు: మోడీ, రాహుల్ హోరాహోరీ
న్యూఢిల్లీ: గుజరాత్ ఎన్నికల ప్రచారం మినీ లోకసభ సాధారణ ఎన్నికలను తలపించింది. ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెసు నేత రాహుల్ గాంధీల మధ్య పోటీగా కూడా అనిపించింది. ఇరువురు కూడా గుజరాత్ ఎన్నికల ప్రచారంలో మునిగి తేలారు.
Recommended Video
గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పలు వివాదాలు కూడా ముందుకు వచ్చాయి. ప్రచారంలో కాంగ్రెసు, బిజెపి పోటీ పడి వివాదాలను సృష్టించాయి. ప్రచారం వేడిగా సాగింది. వాగ్బాణాలను వాడిగా విసురుకున్నారు.
మొదటి వివాదం ఇలా..
గుజరాత్ ఎన్నికల పోలింగ్ తేదీలను ఆలస్యంగా ప్రకటించడం వివాదంగా మారింది. ఇది గుజరాత్ ఎన్నికలకు సంబంధించిన తొలి వివాదం. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల పోలింగ్ తేదీలను అక్టోబర్ 13వ తేదీన ప్రకటించిన ఎన్నికల కమిషన్ సంప్రదాయాన్ని పక్కన పెట్టి గుజరాత్ ఎన్నికల పోలింగ్ తేదీలను ప్రకటించలేదు.
అప్పుడు ఇలాచ చేశారు
2002 - 03లో గుజరాత్ ఎన్నికల తేదీలను 2002 అక్టోబర్ 28వ తేదీన ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల తేదీలను 2003 జనవరి 11వ తేదీన ప్రటించింది. గుజరాత్ అల్లర్ల కారణంగా ఈ తేడా చోటు చేసుకుంది. అంతేకాకుండా ముందస్తుగానే గుజరాత్ అసెంబ్లీని రద్దు చేశారు. అయినప్పటికీ ఈసి ఇరు రాష్ట్రాల ఎన్నికల తేదీలను ఒకేసారి ప్రకటిస్తూ వస్తోంది.
ప్రతిపక్షాల నుంచి విమర్శ..
గుజరాత్ పోలింగ్ తేదీలను ఈసి ఆలస్యంగా ప్రకటించడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. గుజరాత్లో ఎన్నికల నియమావళిని ఎక్కువ కాలం అమలు చేయడం కష్టంగా ఉంటుంది కాబట్టి ఆలస్యం చేసినట్లు ఈసి సమర్థించుకుంది. అయితే, ఆ తర్వాత ఓటర్లను చేరడానికి బిజెపి, కాంగ్రెసు పోటీ పడడంలో మునిగిపోయాయి.
ఇరు పార్టీలకు కూడా పాటిదార్లే టార్గెట్...
గుజరాత్ ఎన్నికల ప్రచారంలోకి కాంగ్రెసు నుంచి రాహుల్ గాంధీ, బిజెపి నుంచి నరేంద్ర మోడీ దిగి వేడి పుట్టించాయి. ఇరు పార్టీల లక్ష్యం కూడా పాటిదార్ల ఓట్లను సాధించడంగానే మారింది. హార్దిక్ పటేల్ వంటి పాటిదార్ల నాయకులు బిజెపికి వ్యతిరేకంగా పనిచేశారు. పాటిదార్ల నాయకులను బుజ్జగించడానికి ఇరు పార్టలు కూడా తీవ్రంగా ప్రయత్నించాయి.
హార్దిక్ పటేల్ వీడియో కలకలం....
హార్దిక్ పటేల్ రాహుల్ గాంధీని అహ్మదాబాద్లోని ఓ హోటల్లో కలుసుకోవడం వివాదంగా మారింది. అ తర్వాత హార్దిక్ పటేల్కు సంబంధించిన సెక్స్ వీడియో అంటూ ఒక్కటి కలకలం రేపింది. అయితే, చివరగా పాటిదార్లు కాంగ్రెసు వైపు తిరిగారు. సీట్ల కేటాయింపుపై తుది నిర్ణయం వచ్చిన తర్వాతనే కాంగ్రెసుతో సయోధ్య కుదిరింది. కాంగ్రెసు పార్టీ విడుదల చేసిన తొలి జాబితాపై పాటిదార్లు తీవ్ర ఆందోళనకు దిగారు. కొద్దిపాటి హింస కూడా చెలరేగింది. చివరకు హార్దిక్ పటేల్ పాటిదార్ అనామత్ ఆందోళన్ నాయకులను హార్దిక్ పటేల్ బుజ్జగించారు.
ఆ తర్వాత మత వివాదం...
ఆ తర్వాత మత వివాదం ముందుకు వచ్చింది. సోమనాథ్ ఆలయం రిజిస్టర్లో రాహుల్ గాంధీ పేరు హిందూయేతరుగా నమోదయిందనే వివాదం బయలు దేరింది. ఇది నిజమా, కాదా అనేది ఇంకా తేలనే లేదు. ఆ ఆరోపణలను ఖండించడానికి కాంగ్రెసు నాయకులు రాహుల్ గాంధీ వివిధ ఆలయాలను సందర్శంచిన ఫొటోలను విడుదల చేశారు. చివరగా గాంధీ కుటుంబం శైవభక్తులనే స్పష్టీకరణ కూడా ఇచ్చారు.
మోడీపై మణిశంకర్ అయ్యర్ వాఖ్య...
ప్రధాని నరేంద్ర మోడీపై ప్రస్తుత బహిష్కృత నేత మణిశంకర్ అయ్యర్ నీచ్ అంటూ చేసిన వ్యాఖ్య తీవ్రవివాదానికి కారణమైంది. దానిపై కాంగ్రెసు నాయకత్వం అత్యంత వేగంగా స్పందించి ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. మణిశంకర్ అయ్యర్ క్షమాపణ చెప్పినప్పటికీ ఫలితం లేకుండా పోయిది. గుజరాత్ ఆత్మగౌరవాన్ని దెబ్బ తీశారంటూ ప్రధాని మోడీ స్వయంగా మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యపై విరుచుకుపడ్డారు. మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలు కాంగ్రెసుకు నష్టం చేశాయా అనేది వేచి చూడాల్సిందే.
పాకిస్తాన్ జోక్యంపై మోడీ వ్యాఖ్యలు
గుజరాత్ ఎన్నికల్లో పాకిస్తాన్ జోక్యం చేసుకుంటోందంటూ ప్రధాని మోడీ వ్యాఖ్యానించి వివాదానికి తెర తీశారు. పాకిస్తాన్ అధికారులతో కాంగ్రెసు నేతలు సమావేశమయ్యారని, అహ్మద్ పటేల్ను ముఖ్యమంత్రిని చేయాలని పాకిస్తాన్ కోరిందని ఆయన అన్నారు. ఓటమి భయంతోనే బిజెపి ఆ విమర్శలు చేస్తోందని కాంగ్రెసు విరుచుకుపడింది. భారత రాజకీయాల్లోకి తమను లాగవద్దంటూ పాకిస్తాన్ ఓ ప్రకటన విడుదల చేసింది.
మోడీపై అల్పేష్ ఠాకూర్ వ్యాఖ్య
కాంగ్రెసు ఓబిసి నాయకుడు అల్పేష్ ఠాకూర్ మోడీపై తన వ్యాఖ్య ద్వారా గుజరాత్ ఎన్నికలకు కాస్తా హాస్యాన్ని జోడించారు. మోడీ విదేశాల నుంచి దిగుమతి అయిన పుట్టగొడుగులను తింటారని, ఆయన ఆహారం ఖర్చు రోజుకు 4 లక్షల రూపాయలు అవుతుందని ఆయన అన్నారు. అందుకే మోడీ అందంగా మారారని అన్నారు.
రాహుల్ గాంధీకి ఈసి నోటిసు..
ప్రచార ఘట్టం ముగిసిన తర్వాత ఓ టెలివిజన్ చానెల్కు రాహుల్ గాంధీ ఇచ్చిన ఇంటర్వూ కూడా వివాదంగా మారింది. దానిపై ఈసి రాహుల్ గాంధీకి నోటీసు జారీ చేసింది. మోడీ అహ్మదాబాద్లోని రనిప్లో ఓటు వేసిన తర్వాత వేలిని చూపుతూ రోడ్ షో నిర్వహించడం కూడా వివాదంగా మారింది. ఈసి మోడీ ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారిందని కాంగ్రెసు దుయ్యబ్టింది.