జగనే నెం1, టిలో కేజ్రీ కంటే తక్కువ: మోడీ-బాబుతో
న్యూఢిల్లీ: తెలంగాణ నిర్ణయం నేపథ్యంలో రెండు ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ పుంజుకోగా, తెలంగాణలో కాంగ్రెసు పార్టీ, సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ ముందంజలో ఉందట. ఉత్తరాదిన గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ హవా కనిపిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోను ఆయన హవా బాగానే ఉందట. అలాగే టిడిపి, బిజెపి కలిస్తే మెజార్టీ సీట్లు సాధించే అవకాశముందట.
లోక్నీతి - సిఎన్ఎన్ ఐబిఎన్ నేషనల్ ట్రాకర్ పోల్ సర్వే ప్రకారం... అటు సీమాంధ్రలోనూ, ఇటు తెలంగాణలోనూ బిజెపి పరిస్థితి గణనీయంగా మెరుగు పడుతోంది. ఆంధ్రప్రదేశ్లో 22 శాతం మంది మోడీ ప్రధాని అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపితే 15 శాతం మంది రాహుల్ గాంధీకి ఓటేశారు. తెలంగాణలో 20 శాతం మంది, సీమాంధ్రలో 23 శాతం మంది మోడీకి జై కొట్టారు. ఆరు నెలల కిందట రాష్ట్రంలో మోడీ ప్రధాని అభ్యర్థిత్వానికి ఏడు శాతం మంది మాత్రమే మద్దతు తెలిపితే ఇప్పుడు 15 శాతం ఓట్ల శాతం పెరిగింది.
ఇది రాహుల్ మొత్తం ఓట్ల శాతంతో సమానం. ఇక, ఆరు నెలల కిందటి పరిస్థితితో పోలిస్తే, తెలంగాణలో బిజెపి 11 శాతం, సీమాంధ్రలోనూ ఏడు శాతం మెరుగు పడింది. తెలంగాణలో టిడిపి ఒక శాతం నష్టపోయినా సీమాంధ్రలో ఆ పార్టీ ఏకంగా తొమ్మిది శాతం మెరుగుపడింది. 2009 ఎన్నికల్లో బిజెపి, టిడిపి ఓట్ల శాతం కలిపితే 29. ఇప్పుడు అది 31 శాతానికి పెరిగిందని సర్వేలో తేలింది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన తర్వాత ఆంధ్రప్రదేశ్ రెండు ప్రాంతాలుగా విడిపోయిందని, తెలంగాణ, సీమాంధ్రలు వేర్వేరు దిశల్లో వెళుతున్నాయని, ఎన్నికల ఫలితాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపించిందని సర్వే వ్యాఖ్యానించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైయస్సార్ కాంగ్రెసు 11 నుంచి 19 సీట్లు, టిడిపి 9 నుంచి 15 సీట్లు, కాంగ్రెస్ 5 నుంచి 9 సీట్లు, తెరాస 4 నుంచి 8 సీట్లు, ఇతరులకు నాలుగు సీట్ల వరకు వచ్చే అవకాశం ఉందట.
తెలంగాణలో కాంగ్రెస్ ముందంజలో ఉంటే సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు పైచేయి సాధించే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలో కాంగ్రెస్ 33 శాతం ఓట్లను సాధిస్తుందని, అదే సమయంలో తెరాస ఓట్ల శాతం 23 శాతం మాత్రమేనని వెల్లడించింది. ఇక్కడ బిజెపి ఓట్ల శాతం 11 శాతం ఉంటే, టిడిపి 13 శాతం ఓట్లకే పరిమితం అవుతుందట. తెలంగాణలో ఆమ్ ఆద్మీ పార్టీకి (ఎఎపి) మూడు శాతం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఒకే ఒక్క శాతం ఓట్లు వస్తాయని సర్వేలో తేలింది.
ప్రస్తతం సీమాంధ్రలో జగన్ పార్టీ ముందంజలో ఉన్నా టిడిపి, బిజెపి రోజురోజుకు తమ పట్టు పెంచుకుంటున్నాయట. రాష్ట్రం మొత్తం మీద కాంగ్రెస్ 24 శాతం ఓట్ల శాతాన్ని సాధిస్తే జగన్ పార్టీ 22 శాతం, టిడిపి 21 శాతం, బిజెపి 10శాతం, తెరాస 11 శాతం ఓట్ల శాతాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయట. తెలంగాణలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇమేజ్ తగ్గుతుండగా, సీమాంధ్రలో పట్టు పెంచుకున్నారట.