మోడీ మాటే చెల్లు: దత్తాత్రేయకు నిరాశ వెనుక...!
న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తాను అనుకున్నదే చేశారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో బిజెపికి పూర్తి మెజార్టీ వచ్చింది. ఎన్డీయే పక్షాలను పక్కన పెట్టే అవకాశం ఉన్నా మోడీ ఆ పని చేయలేదు. భవిష్యత్తు దృష్ట్యా ఆయన మిత్రులతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఏర్పాటులో తమ అవసరం లేకపోవడంతో ఎన్డీయే కూటమిలోని పక్షాలు సైతం ఇచ్చిన శాఖ తీసుకున్నాయి తప్ప ఇష్టమైన శాఖ ఇచ్చి తీరాలని పట్టుపట్టలేదు.
దీంతో.. ఎక్కువ ఎంపీలున్న పార్టీకి ఎక్కువ సీట్లు ఇవ్వాలనే సంప్రదాయానికి మోడీ కట్టుబడాల్సిన అవసరం లేకపోయింది. 75 ఏళ్లలోపు వారికి మాత్రమే కేబినెట్లో చోటు, ప్రముఖుల వారసులకు కేంద్ర మంత్రి పదవులు ఇవ్వకూడదు... లాంటి స్వీయ నిబంధనలు పెట్టుకుని వాటిని కఠినంగా పాటించడానికి, ప్రతిభకు మాత్రమే పట్టం కట్టడానికి మోడీకి పరిణామాలన్నీ తోడ్పడ్డాయి. దీంతో మోడీ పూర్తి స్వేచ్ఛతో తన మంత్రివర్గ సహచరులను ఎంచుకున్నారు.
ఈ కారణంగానే స్మృతి ఇరానీ, నిర్మలా సీతారామన్, ప్రకాశ్ జవదేకర్ వంటి వారికి చోటు దక్కింది. పార్టీకి చెందిన ప్రమోద్ మహాజన్ కుమార్తె పూనమ్ మహాజన్, యశ్వంత్ సిన్హా కుమారుడు జయంత్ సిన్హా, రాజస్థాన్ సీఎం వసుంధర రాజె కుమారుడు దుష్యంత్ సింగ్, ఛత్తీస్గఢ్ సీఎం రమణ్ సింగ్ కుమారుడు అభిషేక్ సింగ్, హిమాచల్ప్రదేశ్ సీఎం ప్రేమ్కుమార్ ధుమాల్ కుమారుడు అనురాగ్ ఠాకూర్ వంటి వారికి కేబినెట్లో చోటు దక్కలేదు.
సుష్మాస్వరాజ్, ఉమాభారతి, స్మృతి ఇరానీ, నిర్మలా సీతారామన్ వంటివారిని చేర్చుకోవడం ద్వారా.. తన మహిళా సాధికారత నినాదానికి మోడీ కట్టుబడినట్లయింది. లోకసభ స్పీకర్గా సుమిత్రా మహాజన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. పార్టీ సీనియర్ నేత, మోడీకి ముందు వారణాసి నియోజకవర్గం నుంచి గెలిచిన మురళీ మనోహర్ జోషీ(80)కి కేంద్ర మంత్రి పదవి ఇస్తారనే ఊహాగానాలు వినిపించాయిగానీ.. 75ఏళ్ల లోపు వారికి మాత్రమే కేంద్రమంత్రి పదవి అనే నిబంధన వల్ల ఆయనకు చోటు దక్కలేదు.
ఒక్క జోషీకే కాదు.. పార్టీలో గతంలో కీలకపాత్ర పోషించిన ఆడ్వానీ, శాంతా కుమార్, బిసి ఖండూరి వంటి పలువురు నేతలకు ఈ నిబంధన వల్లే కేబినెట్లో చోటు దక్కలేదు. మోడీ కేబినెట్లో 70 ఏళ్లు దాటినవారు ఇద్దరే. ఒకరు కల్రాజ్ మిశ్రా (73), మరొకరు నజ్మాహె ప్తుల్లా (74). మిగతావారిలో ఎక్కువ మంది 60ల్లో ఉన్నవారే.
దత్తాత్రేయకు నిరాశ వెనుక..!
బిజెపి సీనియర్ నేత, సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయకు మోడీ కేబినెట్లో చోటు దక్కక పోవడంపై వివిధ రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సికింద్రాబాద్ నియోజక వర్గం నుంచి నాలుగోసారి లోకసభకు ఎన్నికైన దత్తాత్రేయకు మోడీ మంత్రివర్గంలో చోటు లభిస్తుందన్న ప్రచారం జోరుగా జరిగింది. బిజెపి అభ్యర్థిగా తెలంగాణ నుంచి దత్తాత్రేయ ఒక్కరే లోకసభకు ఎన్నికవడంతో కేంద్రంలో ఆయనకు మంత్రి పదవి ఖాయమని చాలా మంది అంచనాలు వేశారు.
అయితే మోడీ మంత్రివర్గంలో దత్తాత్రేయకు చోటు లభించలేదు. బిజెపిలోని ఒక వర్గం చివరి క్షణంలో చక్రం తిప్పి దత్తన్నకు మంత్రి పదవి రాకుండా అడ్డుకోగలిగిందన్న ప్రచారం బలంగా సాగుతోంది. లోకసభ ఎన్నికల్లో దత్తాత్రేయకు టికెట్ రాకుండా అడ్డుకునేందుకు బిజెపిలోని ఒక వర్గం చివరి వరకూ విఫలయత్నం చేసినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దత్తాత్రేయకు మంత్రి పదవి రాకుండా అడ్డుపుల్ల వేసి ఉంటారంటున్నారు. అయితే, త్వరలో జరగనున్న విస్తరణలో దత్తాత్రేయకు అవకాశం వస్తుందని రాష్ట్ర నేతలు చెబుతున్నారు.