జగన్కు చావో రేవో: బాబు ఆచితూచి, తేల్చని పవన్ కల్యాణ్
Recommended Video

విజయవాడ: తెలుగుదేశం పార్టీతో బిజెపిలోని ఓ వర్గం కయ్యానికి కాలు దువుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సమీకరణాలు మారుతాయా అనే అనుమానాలు తలెత్తుత్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వంపై బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఒంటి కాలి మీద లేస్తున్నారు.
పోలవరం ప్రాజెక్టుపై తమ పార్టీని బద్నాం చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారనేది ఆయన ముఖ్యమైన ఆరోపణ. అయితే, పార్లమెంటు సభ్యుడు హరిబాబు నేతృత్వంలోని బిజెపిలోని మరో వర్గం మాత్రం చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తోంది.

జగన్ వైపు బిజెపిలోని ఓ వర్గం..
బిజెపిలోని ఓ వర్గం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే సోము వీర్రాజు, తదితరులు చంద్రబాబు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నట్లు భావిస్తున్నారు. జగన్కు రాష్ట్రంలో అధికారం ముఖ్యం కాబట్టి పొత్తు పెట్టుకుంటే తమకు ఎక్కువ లోకసభ స్థానాలు ఇచ్చే అవకాశం ఉందని బిజెపిలోని ఓ వర్గం భావిస్తోంది. కేంద్రంలో అధికారంలోకి రావడం తమకు ముఖ్యం కాబట్టి జగన్తో వెళ్లడమే మంచిదనే భావనతో ఆ వర్గం ఉన్నట్లు సమాచారం.

పవన్ కల్యాణ్ ఇంకా...
ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకోవాలా, ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగాలా అనే విషయంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంకా ఓ స్పష్టతకు రాలేదు. పవన్ కల్యాణ్ తమతోనే కలిసి నడుస్తారని తెలుగుదేశం నాయకులు భావిస్తున్నారు. అందుకే చంద్రబాబు పవన్ కల్యాణ్ పట్ల సానుకూలంగా వ్యవహరిస్తున్నారని అనుకుంటున్నారు. కేంద్రంపై ఎక్కువ విమర్శలు చేస్తూ తమపై తక్కువ విమర్శలు చేయడాన్ని బట్టి ఆ నిర్ధారణకు వస్తున్నట్లు అనుకోవచ్చు.

చంద్రబాబు చాలా తెలివిగా...
ప్రస్తుత పరిస్థితిలో చంద్రబాబు నాయుడు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తున్నారు. బిజెపి నేతలు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ ఆయన సంయమనం పాటిస్తున్నారు. పైగా, బిజెపి నేతల విమర్శలపై ఎదురు దాడికి దిగవద్దని ఆయన పార్టీ నాయకులకు సూచించారు. బిజెపితో తెగదెంపులు చేసుకోవడానికి ఆయన ప్రస్తుతం సిద్ధంగా లేనట్లు కనిపిస్తున్నా అనివార్యమైతే ఏం చేయాలనే వ్యూహరచన కూడా చేసుకుంటున్నట్లు కనిపిస్తున్నారు.

వారేమిటో చంద్రబాబుకు తెలుసు...
నరేంద్ర మోడీ, అమిత్ షా ద్వయం నేతృత్వంలో బిజెపి మునుపటిలా లేదనే విషయాన్ని చంద్రబాబు గ్రహించారు. వారిద్దరి నాయకత్వంలో బిజెపి చూపిస్తున్న తెగువ, దూకుడు ఆయనను ఆలోచనలో పడేసిందనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలం పుంజుకోవాలనే ఎత్తుగడ తనకు ప్రమాదకరంగా పరిణమిస్తుందా అనే ఆలోచన ఆయన చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. అందుకే, ఇప్పుడే తెగే దాకా లాగకూడదనే పద్ధతిలో వ్యవహరిస్తున్నారు.

ఆ రెండు ఎన్నికల ద్వారా సంకేతాలు...
నంద్యాల ఉప ఎన్నిక విజయంతోనూ, కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల విజయంతోనూ చంద్రబాబులో ఆత్మ విశ్వాసం పెరిగిందని చెప్పవచ్చు. నంద్యాలలో బిజెప మద్దతు లేకుండా గెలిచామనే సంకేతాలను ఆయన పంపించారు. బిజెపితో పొత్తు వల్ల ముస్లింలు దూరమయ్యారని, వారంతా వైసిపికి ఓటేశారనే సంకేతాలను ఆయన పంపినట్లు భావిస్తున్నారు. తద్వారా తనతో తెగదెంపులు చేసుకుంటే బిజెపి నష్టపోతుందనే అభిప్రాయాన్ని కలిగించడానికి కూడా ఆయన ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు.

అవసరమైతే పవన్ కల్యాణ్తో...
జనసేన అధినేత పవన్ కల్యాణ్తో కలిసి నడవడానికి చంద్రబాబు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే పవన్ కల్యాణ్ పట్ల మెతక వైఖరి అవలంబిస్తున్నారనే అభిప్రాయం ఉంది. పవన్ కల్యాణ్ను చివరి నిమిషంలోనైనా పొత్తుకు అంగీకరింపజేయగలననే నమ్మకంతో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, ఇరువురికి మధ్య స్నేహం ఇప్పటికే ఉందని, పవన్ కల్యాణ్ చంద్రబాబు కోసమే పనిచేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అంటోంది.

వైఎస్ జగన్కు చావో రేవో...
వైయస్ జగన్కు వచ్చే ఎన్నికల్లో చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. దానికితోడు, కేసులు వెంటాడుతున్నాయి. ఈ స్థితిలో ఆయన బిజెపితో అవగాహనకు రావడానికి సిద్ధపడవచ్చునని అంటున్నారు. ఆయన ప్రజా సంకల్ప యాత్ర పేరుతో ప్రస్తుతం పాదయాత్ర చేస్తూ ప్రజలకు దగ్గర అవుతున్నారు.












Click it and Unblock the Notifications