కేంద్ర కేబినెట్లోకి రామ్ మాధవ్, గవర్నర్ ఇంటికి..?
హైదరాబాద్: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)లో కీలక నేతగా ఎదిగిన తెలుగు తేజం రామ్ మాధవ్ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఇటీవలే బీజేపీలో పార్టీలో చేరారు. పార్టీ అధికార ప్రతినిధి హోదాలో పార్టీ చీఫ్ అమిత్ షా, ప్రధాని నరేంద్రమోడీ అంచనాలకు మించి ఫలితాలు సాధిస్తున్నారు.
ఇటీవల జరిగిన జమ్మూ కశ్మీర్ ఎన్నికల్లో బీజేపీ గణనీయంగా సీట్లు సాధించడంతోపాటు అనంతరం బీజేపీ-పీడీపీ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఆశించిన మేర కంటే మెరుగ్గా రాణిస్తున్న రామ్ మాధవ్ను కేంద్ర కేబినెట్లోకి తీసుకోవాలని ప్రధాని నరేంద్రమోడీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈనెల 8న మంత్రి వర్గ పునర్వ్యస్ధీకరణ జరగనున్న నేపథ్యంలో రామ్ మాధవ్కు కేబినెట్ బెర్తు దక్కునుందని తెలుస్తోంది. పనిచేయని మంత్రులకు ఉద్వాసన పలికేందుకు ప్రధాని మోడీ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారట.
ప్రధాని మోదీ మంత్రి వర్గంలోనూ మార్పులు జరగనున్నాయి. పాలనను మెరుగుపరచడం, మిత్రులను సంతృప్తిపరచడం లాంటి లక్ష్యాలతో ఈ మార్పులు చేపడతారని చెబుతున్నారు. మంత్రివర్గం నుంచి మరికొందర్ని తొలగించి వారిని గవర్నర్లుగా పంపవచ్చని తెలు స్తోంది.

మైనారిటీ వ్యవహారాల మంత్రి నజ్మా హెప్తుల్లా, చిన్నతరహా పరిశ్రమల మంత్రి కల్రాజ్ మిశ్రా పేర్లు ఇందుకు వినిపిస్తున్నాయి. శివసేన, పీడీపీ, బీజేపీల నుంచి మరికొంత మందిని చేర్చుకోవచ్చని తెలుస్తోంది. ఎన్నికలు జరగనున్న బీహార్ నుంచి ఒకరికి స్థానం కల్పిస్తారంటున్నారు.
ఇక, మానవ వనరుల మంత్రి స్మృతీ ఇరానీకి స్థానచలనమో, ఉద్వాసనో జరిగే అవకాశాలున్నట్లు సమాచారం. శివసేన నుంచి ఆనంద్రావు అడ్సుల్, లేదా అనిల్ దేశాయ్, పీడీపీ నుంచి ముజఫర్ హుస్సేన్ బేగ్ లేదా తారిఖ్ హమీక్ కర్రా, బీజేపీ నుంచి షానవాజ్ హుస్సేన్లకు అవకాశం లభించవచ్చని సమాచారం.
రైల్వే శాఖ సహాయ మంత్రి, యూపీకి చెందిన మనోజ్ సిన్హా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వి, నైపుణ్యాభివృద్ధి మంత్రి రాజీవ్ ప్రతాప్ రూఢీ తదితరులకు కేబినెట్ హోదాలో ప్రమోషన్ లభిస్తుందని తెలుస్తోంది.
ఇక తెలుగు రాష్ట్రాలు ఉమ్మడి గవర్నర్ నరసింహాన్ను కేంద్ర ప్రభుత్వం ఇంటికి పంపనుందా? అంటే అవుననే అంటున్నారు ఢిల్లీ వర్గాలు. తెలుగు రాష్ట్రాల్లో త్వరలో ఇద్దరు గవర్నర్లు రాబోతున్నారని సమాచారం. గవర్నర్ల మార్పుల్లో భాగంగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్గా ఉన్న నరసింహన్తో రాజీనామా చేయించి, ఆయన స్థానంలో కొత్త వారిని నియమిస్తారని సమాచారం.
మరో 9 రాష్ట్రాలకు కూడా గవర్నర్లను నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక, కొత్తగా గవర్నర్ పదవులు పొందనున్న వారిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు చెందిన పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ నుంచి టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు పేరును చంద్రబాబు కేంద్రానికి సూచించినట్లు చెబుతున్నారు. అలాగే, సీమాంధ్ర నుంచి బీజేపీ సీనియర్ నేత ప్రొఫెసర్ శేషగిరిరావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications