యోగి దూకుడు: సమస్యల సుడిగుండాల నుంచి...
ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు దిశగా వడివడిగా ముందుకు సాగుతోంది.
లక్నో: ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు దిశగా వడివడిగా ముందుకు సాగుతోంది. తీవ్ర నిరుద్యోగ సమస్యతో ఉన్న యూపీలో మూడు నెలల్లో రోజ్గార్ మేళా (ఉద్యోగ సమ్మేళనం) నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నది. ప్రత్యేకించి ఇంజినీరింగ్, మేనేజ్మెంట్ కోర్సులు పూర్తిచేసుకున్న విద్యార్థులకు ఉపాధి లభించేందుకు తగు చర్యలు తీసుకోనున్నది.
'ఆరు ఎయిమ్స్, 25 నూతన మెడికల్ కళాశాలలు ప్రారంభిస్తామని మేం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీకి అనుగుణంగా సరైన దిశలో పని ప్రారంభించాం. ఈ సంస్థల ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించిన స్థలాలను కుదించి తుది ప్రతిపాదనలు రూపొందించిన తర్వాత సీఎం యోగి ఆదిత్యనాథ్ కేంద్రానికి నివేదిక పంపుతారు' అని యూపీ సాంకేతిక, వైద్యవిద్యాశాఖ మంత్రి అశుతోష్ టాండన్ గోపాల్జీ ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
రాష్ట్ర జనాభా ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా ఎయిమ్స్, మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయాల్సి ఉందని, వచ్చే ఐదేళ్లలో ఆ కళాశాలలు విద్యార్థులకు, ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని అశుతోష్ లాండన్ గోపాల్జీ చెప్పారు. విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్యాబోధన దిశగా అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
ఉపాధి అవకాశాలపై మంత్రి అశుతోష్ టాండన్ ఇలా
విద్యాబోధనలో నాణ్యత ఉంటే మార్కెట్లో ఉపాధి అవకాశాలకు కొదవ లేదని మంత్రి అశుతోష్ లాండన్ గోపాల్జీ అన్నారు. ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలల్లో మౌలిక వసతుల కల్పనకే తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నదని అశుతోష్ టాండన్ వివరించారు. ప్రస్తుతం ఇంజినీరింగ్, మేనేజ్మెంట్ కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఉపాధి కోసం జాబ్ మేళాలు నిర్వహిస్తామని తెలిపారు. తమ ప్రభుత్వం ప్రత్యేకించి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టుల భర్తీపైనే ఫోకస్ పెట్టిందని, తొలుత నూతన విద్యాసంవత్సరం ప్రారంభించే నాటికి ఖాళీగా ఉన్న 500 పోస్టులను భర్తీ చేయాలని అధికారులను ఆదేశించినట్లు వివరించారు. రాష్ట్రంలోని 600లకు పైగా ప్రైవేట్, 13 ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలల క్యాంపస్ల్లో విద్యార్థుల సౌకర్యార్థం.. ‘వైఫై', ‘ఇ - లైబ్రరీ' వసతులు అందుబాటులోకి తెస్తున్నామని అశుతోష్ టాండన్ గోపాల్జీ వివరించారు.
70లక్షల మందికి ఉపాధి కల్పనే ధ్యేయం
లక్నో ఎయిర్పోర్టు సమీపాన దేశంలోకెల్లా అతిపెద్ద బిజినెస్ ఇంకుబేటర్ ఏర్పాటుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. 70 లక్షల మంది యువతకు ఉపాధి కల్పన కోసం ఐటీ పార్కులు, స్టార్టప్ ఇంకుబేటర్లు ఏర్పాటు చేయడమే తమ లక్ష్యమని వచ్చే ఐదేళ్లలో రాష్ట్ర యువతకు ఉపాధి, స్వయం ఉపాధి కల్పనే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రణాళికను సిద్ధం చేయాలని ఐటీ శాఖను ఆదేశించారు. కాంట్రాక్టు పనులు చేపట్టేందుకు ‘ఇ - టెండర్' విధానం అమలు చేయాలని స్పష్టం చేశారు. ప్రజలకు సరైన సేవలు అందించని జన్ సేవా కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీచేశారు.
లక్నోలో ఎలక్ట్రానిక్ సదన్ పై యోగి ఇలా
మథుర హిందూస్థాన్ కాలేజీలో వచ్చే 100 రోజుల్లోనే ఇంకుబేటర్ వసతి కల్పనకు అవసరమైన చర్యలన్నీ తీసుకోవాలని అధికారులను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. లక్నో నగరంలో ‘ఎలక్ట్రానిక్ సదన్' ఏర్పాటుకు అవసరమైన చర్యలపై సవివరమైన నివేదిక సమర్పించాలని ఆయాశాఖల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు.
యూపీలో ఆరోగ్య రంగంపై ఇలా
రాష్ట్రంలోని అట్టడుగు వర్గాలకు లబ్ది చేకూర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని యూపీ ఆరోగ్యశాఖ మంత్రి సిద్ధార్థనాథ్ సింగ్ చెప్పారు. అందులో భాగంగా ఆరోగ్య పరిరక్షణ రంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలని నిర్ణయించామన్నారు. గత ప్రభుత్వాల విధానాల వల్లే అణగారిన వర్గాల ప్రజలకు ఆరోగ్య సేవలు అందుబాటులోకి రాలేదని సిద్ధార్థనాథ్ సింగ్ అన్నారు. పూర్తిగా ఆరోగ్య పరిరక్షణ వ్యవస్థ భగ్నమైందన్నారు. ప్రస్తుతం వైద్య సేవలు బలోపేతం చేయడంతోపాటు మౌలిక వసతులు కల్పించడం ద్వారా విస్తరించనున్నామని తెలిపారు. ప్రజలకు హెల్త్ సర్వీసులు అందుబాటులోకి తెచ్చేందుకు టెక్నాలజీని వినియోగించుకుంటున్నట్లు చెప్పారు. త్వరలో టెలీ మెడిసిన్ ప్రవేశపెడ్తామన్నారు. అలాగే మెడికల్ మొబైల్ యూనిట్లు ప్రవేశపెట్టాలని పేర్కొన్నారు. తద్వారా పూర్తిస్థాయి హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తూ ప్రజలకు వైద్యారోగ్య సేవలు అందించడమే లక్ష్యమన్నారు.