సభ రద్దు, ఈ నెల్లో ఓట్ ఆన్ బడ్జెట్కు కిరణ్ ప్లాన్
హైదరాబాద్: రాష్ట్ర చరిత్రలో మొదటిసారి జనవరిలోనే బడ్జెట్లో ఓట్ ఆన్ అకౌంట్ ప్రస్తానం ప్రారంభం కానుందా? అంటే అవుననే సంకేతాలు అందుతున్నాయి. జనవరి నెలాఖరులోనే ఓట్ ఆన్ అకౌంట్ను ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి యోచిస్తున్నట్టుగా సమాచారం. ఇప్పుడున్న షెడ్యూల్ మేరకు జనవరి 23న తెలంగాణ బిల్లుపై శాసనసభ చర్చా సమావేశాలు ముగుస్తాయి.
తరువాత రెండు రోజులు విరామమిచ్చి ఓట్ ఆన్ అకౌంట్కు మళ్లీ సమావేశం కావాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన ఆలోచన కార్యరూపం దాల్చితే 25న లేదా 27న శాసన సభను తిరిగి సమావేశపరుస్తారు. గతంలో ఎన్నికల సంవత్సరంలో ఎప్పుడూ ఫిబ్రవరిలో ఓట్ ఆన్ అకౌంట్ను ప్రవేశపెట్టి మూడు నెలలకు ఆమోదింపచేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
ఇప్పుడు కూడా ఫిబ్రవరిలోనే ఓట్ ఆన్ అకౌంట్ను సభ ముందు ఉంచాలని భావించినప్పటికీ, రోజురోజుకూ మారుతున్న రాజకీయ పరిణామాలు, రాష్ట్ర విభజన వేడి నేపథ్యంలో ఓట్ ఆన్ అకౌంట్ను ముందుగానే సభ ముందు ఉంచేలా కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి త్వరగా ఓట్ ఆన్ అకౌంట్ పత్రాలు సిద్ధం చేయాలని, బడ్జెట్ను కూడా త్వరగా తయారు చేయాలని ఆర్ధిక శాఖకు సూచనలు వెళ్లాయట.
నాలుగైదు రోజులపాటు సభను సమావేశపర్చి ఓట్ ఆన్ అకౌంట్కు ఆమోదం పొందేలా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికీ కొంతమంది మంత్రులు ఫిబ్రవరిలోనే ఓట్ ఆన్ అకౌంట్ను ప్రవేశపెడితే బాగుంటుందన్న భావాన్ని వ్యక్తం చేస్తున్నారట. తొందరపాటు అడుగులుకన్నా, ఫిబ్రవరి వరకూ వేచి చూడాలన్న భావాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ముఖ్యమంత్రి త్వరలోనే తుది నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలున్నాయంటున్నారు.
మరోవైపు సభలో ఓట్ ఆన్ అకౌంట్కు ఆమోదం పొందిన వెంటనే ముఖ్యమంత్రి రాజీనామా అంశం కూడా చర్చకు రావొచ్చని అంటున్నారు. వాస్తవంగా మేథోమథనం సమీక్షల్లోనే రాజీనామా అంశం చర్చకు వస్తుందని భావిస్తున్నప్పటికీ, నిర్ణయం మాత్రం ఓట్ ఆన్ అకౌంట్ ఆమోదం పొందిన వెంటనే తీసుకుంటారంటున్నారు. శాసనసభను రద్దు చేయాలన్న ఆలోచనలో కూడా ముఖ్యమంత్రి ఉన్నారని అంటున్నారు.
అసెంబ్లీని రద్దు చేయాలంటే రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం అవసరం. కేబినెట్లో సీమాంధ్ర మంత్రుల సంఖ్యాబలం అధికంగా ఉన్నందున ఆ పని సులువుగా జరిగిపోతుంది. ఈ నెల 23 తర్వాత మేధో మథనం చేద్దామంటూ కిరణ్ స్పష్టం చేయడం, రాజకీయ పరిణామాల్లో భారీ మార్పులు రానున్న నేపథ్యంలో కిరణ్ ఏం చేస్తారనే ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇప్పుడు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఈ నెలలోనే ప్రవేశ పెట్టాలని, ఆ తర్వాత శాసన సభను రద్దు చేయడం, రాజీనామా చేస్తారంటుండటం గమనార్హం.