జూన్లో విభజన: ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికలు!?
న్యూఢిల్లీ: పార్లమెంటులో రాష్ట్ర విభజన ప్రక్రియ ముగిసినా సాంకేతిక కారణాల దృష్ట్యా ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికలు జరపాలని కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. విభజన బిల్లుకు ఉభయ సభల ఆమోదం పొందినప్పటికీ రాష్ట్రపతి ప్రకటించే అపాయింటెడ్ డేట్ నుంచే విభజన అధికారికంగా అమలులోకి వచ్చినట్లవుతుంది. ఈ నెల 21వ తేదీతో ముగిసే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు ఆమోదం పొందినప్పటికీ, రాష్ట్ర విభజన మాత్రం అధికారికంగా జూన్లోనే జరుగనుందట.
ఇప్పటికిప్పుడు రెండు రాష్ట్రాల్లో వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేకపోవడమే దీనికి కారణమంటున్నారు. మార్చి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూలు వెలువడే అవకాశం ఉంది. వచ్చే రెండు నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశముంది. ఈ నేపథ్యంలో రాష్ట్రం విడిపోయినట్లు అధికారికంగా ప్రకటిస్తే ఎన్నికలు జరపటంలో సాంకేతిక సమస్యలు తలెత్తవచ్చునని కేంద్రం భావిస్తోంది.

నియోజకవర్గాల పునర్విభజన, సీట్ల మార్పులు, చేర్పులు కష్టతరమవుతుంది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఏర్పడ్డాక ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. అప్పటి వరకు ఎన్నికలను వాయిదా వేయడం సాధ్యం కాదని కేంద్రం నిర్ధారణకు వచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికలు జరిపి, మొదటిసారి శాసనసభ కొలువుదీరిన తర్వాత అపాయింటెడ్ డేట్ ప్రకటించి అప్పటి నుంచి రెండు రాష్ట్రాలు, రెండు శాసనసభలు ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది.
ఇలా చేస్తే నియోజకవర్గాల పునర్ విభజన తాత్కాలికంగా వాయిదా పడుతుంది. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను ఆ తర్వాత వచ్చే ఎన్నికల నాటికి చేపడుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికలు జరిపితే ఎన్నికల అనంతరం రెండు ప్రభుత్వాల ఏర్పాటు సులువు అవుతుందని కూడా కేంద్రం భావిస్తోందట.












Click it and Unblock the Notifications