జెపి దారిలో పవన్ కల్యాణ్: ఆదర్శవాదం పనికి వస్తుందా?
Recommended Video
అమరావతి: రాజకీయాల్లోకి రావద్దని తెలుగు సినీ హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్కు అప్పట్లో లోక్సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ చెప్పినట్లు ప్రచారం జరిగింది. అయితే, పవన్ కల్యాణ్ వెనక్కి తగ్గకుండా ముందుకే వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఆయనది ప్రధానంగా ఆదర్శవాదం.
ఆ ఆదర్శవాదంతోనే జయప్రకాష్ నారాయణ రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాలను, సమాజాన్ని ప్రక్షాళన చేస్తాననే నమ్మకాన్ని చాలా వరకు కల్పించే ప్రయత్నం చేశారు. యువత ఆయనను చాలా వరకు అభిమానించింది కూడా. స్వచ్ఛ రాజకీయాలతో సమాజాన్ని కడిగి పారేస్తానని ఆయన భావించి ఉంటారని చెప్పవచ్చు.
కానీ, చివరకు రాజకీయాలకు స్వస్తి పలకాల్సి వచ్చింది. స్వయంగా లోకసత్తాలోనే ఆయన రాజకీయాల మర్మాన్ని పసిగట్టి ఉంటారు. దాంతో ఆయన రాజకీయాలకు స్వస్తి చెప్పి ఉంటారు. అది ఆయన నిరాశతోనో నిస్పృహతోనో నిరాశావాదంతోనో చేశారని చెప్పడానికి వీలు లేదు. రాజకీయాల ద్వారా సమాజాన్ని ఏమో గానీ రాజకీయాలనే ప్రక్షాళన చేయలేమనే విషయం అనుభవపూర్వకంగా తెలిసి ఉంటుంది.
జెపి మార్గంలోనే.
దాదాపుగా అటువంటి ఆదర్శవాదంతోనే పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు. కత్తిని కత్తితో కోయాలనే ఉద్దేశం ఆయనకు ఉన్నట్లు లెదు. పవన్ కల్యాణ్కు కూడా రాజకీయాలకు సంబంధించిన అనుభవం లేదని అనలేం. అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ అనుభవం ఉండనే ఉంది.
ప్రజార్యాజ్యానికి ఓ ఊపు...
సామాన్యుల్లో సామాన్యుడై పవన్ కల్యాణ్ ప్రజారాజ్యం పార్టీకి ఓ ఊపునైతే తెచ్చారు గానీ సీట్లను సంపాదించి పెట్టలేకపోయారు. నిజానికి, ఆయనకు ప్రజల్లో అభిమానం ఉంది. ప్రాంతాలకు, కులాలకు అతీతంగా ఆయనకు అభిమానులున్నారు.
ఎపియే ముఖ్యం....
పవన్ కల్యాణ్ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్దపడుతున్నట్లు కనిపిస్తున్నారు. అయితే, ఆయనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలే ప్రధానం. తెలంగాణపై అంత ఆసక్తి ఉన్నట్లు లేదు. బహుశా, పాత రాజకీయ పార్టీల నాయకులను ఆయన తన పార్టీలోకి తీసుకునే అవకాశం లేనట్లు కనిపిస్తున్నారు.
ఇది సాధ్యమవుతుందా...
అంతా కొత్తవాళ్లతో, డబ్బులు పెట్టకుండా నీతీనిజాయితీల మీద ఆధారపడి పవన్ కల్యాణ్ రాజకీయాల్లో పాగా వేస్తారంటే సందేహం. అవినీతిరహితం అని ఎవరు చెప్పినా అది ఉట్టి ఆదర్శవాదం అవుతుంది తప్ప ఆచరణ సాధ్యం కాదు. వ్యక్తిగత స్వార్థం సమాజాన్ని పట్టి పీడిస్తున్నది. అంతేకాకుండా, అవినీతి మీద ప్రజలకు అసహ్యం, వ్యతిరేకత లేవు. పైగా, దానికి సమర్థింపు కూడా ఉంది.
అదే ముఖ్యం
ఎలా అనేది ప్రజలకు ముఖ్యం కాదు, ఎంత సంపాదించావు... ఎన్ని మెట్లు ఎక్కావు... ఎన్ని పదవులు పొందావు అనేవే ముఖ్యం. నిజాయితీగా వ్యవహరించేవారు ఒక రకంగా వారి దృష్టిలో చేతగానివాళ్లు. అందువల్ల రాజకీయాల్లోనే కాదు, ఏ రంగంలోనైనా ఆదర్శవాదం ఈ కాలానికి పనికి రాదు. పవన్ కల్యాణ్ రాజకీయాలకు కూడా అది వర్తిస్తుంది.